రాంచీ వేదికగా భారత్తో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి రోజు ఆటలో ఇంగ్లండ్ మెరుగైన స్థితిలోనే నిలిచింది. శుక్రవారం ఆట ముగిసేసరికి 90 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 302 పరుగులు చేసింది. ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ (106*; 226 బంతుల్లో) అజేయ సెంచరీతో సత్తాచాటాడు. అతడికి తోడుగా క్రీజులో ఒలీ రాబిన్సన్ (31*; 60 బంతుల్లో) ఉన్నాడు.
తొలి రోజు ఆటలో ఇరు జట్లు మధ్య హోరాహోరీ పోటీ సాగింది. అరంగేట్ర బౌలర్ ఆకాశ్ దీప్ చెలరేగడంతో ఇంగ్లండ్ 57 పరగులకే మూడు వికెట్లు కోల్పోయింది. బెన్ డకెట్ (42; 42 బంతుల్లో), ఒలీ పోప్ (0; 2 బంతుల్లో), జాక్ క్రాలే (11; 21 బంతుల్లో) వరుసగా పెవిలియన్కు చేరారు. జడేజా, అశ్విన్ కూడా బంతిని తిప్పడంతో ఇంగ్లండ్ 112 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన బెన్ ఫోక్స్ (47; 126 బంతుల్లో) కలిసి జో రూట్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఆరో వికెట్కు 113 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదుచేశాడు. వీరద్దరు జాగ్రత్తగా ఆడటంతో రెండో సెషన్లో ఇంగ్లండ్ వికెట్ కోల్పోలేదు. ప్రస్తుత టెస్టు సిరీస్లో ఓ సెషన్లో ఇంగ్లండ్ వికెట్ పడకుండా ఆడటం ఇదే తొలిసారి.
అయితే ఆఖరి సెషన్ ప్రారంభంలో మహ్మద్ సిరాజ్ చెలరేగడంతో స్వల్పవ్యవధిలోనే ఇంగ్లిష్ జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. ఫోక్స్తో పాటు హర్ట్లీని సిరాజ్ ఔట్ చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్కు వచ్చిన రాబిన్సన్తో కలిసి రూట్ ఎనిమిదో వికెట్కు అభేద్యమైన అర్ధశతక (57) భాగస్వామ్యాన్ని నమోదుచేశాడు. ఈ క్రమంలో 219 బంతుల్లో శతకాన్ని అందుకున్నాడు. టెస్టు చరిత్రలో భారత్పై పది శతకాలు బాదిన తొలి క్రికెటర్గా జో రూట్ చరిత్రకెక్కాడు. కాగా, భారత్ బౌలర్లలో అకాశ్ దీప్ మూడు వికెట్లు, సిరాజ్ రెండు, జడేజా, అశ్విన్ చెరో వికెట్ తీశారు.