IND vs ENG: భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ రసవత్తరంగా మారింది. అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో మ్యాచ్పై పట్టు బిగించిన టీమిండియా.. బ్యాటింగ్లో మాత్రం ఆశించిన ఆరంభాన్ని అందుకోలేకపోయింది. 193 పరుగుల సాధారణ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 17.4 ఓవర్లలో 4 వికెట్లకు 58 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(33) ఉండగా.. యశస్వి జైస్వాల్(0), కరుణ్ నాయర్(14), శుభ్మన్ గిల్(6) మరోసారి తీవ్రంగా నిరాశపర్చారు. నైట్వాచ్మన్గా బరిలోకి దిగిన ఆకాశ్ దీప్(1) కూడా ఔటయ్యాడు. చివరి రోజు భారత్ విజయానికి కేవలం 135 పరుగులు మాత్రమే అవసరం కాగా.. అదే సమయంలో ఇంగ్లండ్ జట్టు విజయానికి ఇంకా 6 వికెట్లు మిగిలి ఉన్నాయి. ఈ రసవత్తర పోరులో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది.
ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జరుగుతున్న మూడో టెస్ట్ రసవత్తరంగా మారిన నేపథ్యంలో ఇంగ్లండ్ సహాయక కోచ్ మార్కస్ ట్రెస్కోథిక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లపై తనకు పూర్తి నమ్మకం ఉంది.. తొలి గంటలోనే 6 వికెట్లు తీస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు. మార్కస్ ట్రెస్కోథిక్ మాట్లాడుతూ.. "నాలుగో రోజు ఆటలోని చివరి ఒక గంట అద్భుతంగా ఉంది. మా బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఈ మ్యాచ్ను ప్రతి ఒక్కరూ ఆసక్తిగా చూశారు. అభిమానులు కూడా మా జట్టుకు అండగా నిలిచారు. మైదానంలో ఉన్న అభిమానుల మద్దతు మా జట్టు ఆటగాళ్లకు ప్రేరణగా నిలిచింది. చివరి రోజు మొదటి సెషన్ చాలా ముఖ్యం. మొదటి సెషన్లో ఆట ఎలా సాగుతుందో దానిపైనే విజయం ఆధారపడి ఉంటుంది. మేం ఆరంభంలోనే వికెట్లు తీస్తే మ్యాచ్పై పట్టు సాధించే ఛాన్సులు మెండుగా ఉంటాయి. మేం మొదటి ఒక గంటలోనే 6 వికెట్లను పడగొడతాం." అని ఇంగ్లండ్ సహాయక్ కోచ్ మార్కస్ ట్రెస్కోథిక్ పేర్కొన్నారు.

అంతకు ముందు ఇంగ్లండ్ జట్టు తమ రెండో ఇన్నింగ్స్లో 250 పరుగులకు పైగా చేస్తుందని అంచనా వేయబడినప్పటికీ.. వాషింగ్టన్ సుందర్ కేవలం 22 పరుగులే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా ఇంగ్లండ్ జట్టులో ఫాస్ట్ బౌలర్లు కూడా అద్భుతంగా బౌలింగ్ చేసి వికెట్లు తీశారు. జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్లు నాలుగు వికెట్లను పడగొట్టారు. దీనితో భారత జట్టు చివరి రోజు మ్యాచ్ గెలవాలంటే కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ చేతుల్లోనే ఉంది.