
ఇంత జరుగుతున్నా
ఐదో రోజు ఆటలో భారత బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా ( 34 నాటౌట్), మొహ్మద్ షమీ (56 నాటౌట్) చెలరేగిన విషయం తెలిసిందే. ఒకవైపు ఇంగ్లండ్ ఆటగాళ్లు దూషిస్తున్నా.. మరోవైపు పేసర్లు బౌన్సర్లతో బయపెడుతున్నా అద్భుతంగా ఆడారు. ఈ క్రమంలోనే రికార్డు స్థాయిలో 89 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
అయితే ఇంగ్లండ్ పేసర్లు బుమ్రా-షమీలను ఔట్ చేయడానికి చూడకుండా బౌన్సర్లతో ఇబ్బంది పెట్టాలని చూశారు. ఆ ప్రణాళిక కాస్త బెడిసికొట్టడంతో టీమిండియాకు భారీ ఆధిక్యం దక్కింది. ఇంత జరుగుతున్నా.. మిస్టర్ పర్ఫెక్ట్ జో రూట్ ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయాడు. దాంతో అతడి కెప్టెన్సీపై విమర్శలు చెలరేగుతున్నాయి.

ఎప్పుడు ఎలా ఆడాలో కూడా తెలియదా?
తాజాగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసర్ హుస్సేన్ అంతర్జాతీయ పత్రిక డైలీ మెయిల్కు రాసిన ఓ వ్యాసంలో కెప్టెన్ జో రూట్ తీరును ఎండగట్టాడు. 'జో రూట్కు డ్రెస్సింగ్ రూమ్లో, ఇంగ్లండ్ అభిమానుల్లో మంచి ఆదరణ ఉంది. కానీ కెప్టెన్సీ అనేది కేవలం పాపులారిటి కాదు. ఎప్పుడు ఎలా ఆడాలో కూడా ఆ జట్టుకు తెలియట్లేదు.
రూట్ కొన్ని సార్లు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడు. లార్డ్స్లో ఐదో రోజు ఉదయం కూడా తికమక నిర్ణయాలే తీసుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రాతో వివాదం పెట్టుకోకుండా తన బౌలర్లు పరుగులు ఇవ్వకుండా చూడాల్సింది' అని నాసర్ హుస్సేన్ తీవ్రంగా మండిపడ్డాడు.

ఓపెనర్గా హసీబ్ హమీద్
ఐదు టెస్ట్ల సిరీస్లో భాగంగా బుధవారం నుంచి లీడ్స్ వేదికగా జరిగే మూడో టెస్ట్లో భారత్తో అమీతుమీ తేల్చుకోనేందుకు ఇంగ్లండ్ సిద్దమవుతోంది. ఇప్పటికే తమ తప్పిదాలను సరిదిద్దుకునే పనిలో పడిన రూట్ సేన.. తుది జట్టులో మార్పులు చేసేందుకు కూడా వెనుకాడటం లేదు.
ఇప్పటికే ఇద్దరు ఆటగాళ్లపై వేటు వేసి టీ20 స్పెషలిస్ట్ డేవిడ్ మలాన్ను తీసుకుంది. గత రెండు టెస్ట్ల్లో దారుణంగా విఫలమైన ఓపెనర్ డామ్ సిబ్లీ వేటుపడటంతో రోరీ బర్న్స్కు జతగా హసీబ్ హమీద్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. ఆ తర్వాత ఫస్ట్ డౌన్లో మలాన్ బ్యాటింగ్ చేయనున్నాడు. నాలుగో స్థానంలో జో రూట్ ఆడనున్నాడు.

వుడ్ స్థానంలో సకీబ్ మహమూద్
మిడిలార్డర్లో జానీ బెయిరిస్టో, జోస్ బట్లర్, మోయిన్ అలీ జట్టును ఆదుకునే బాధ్యత తీసుకోనున్నారు. లోయర్ ఆర్డర్లో సామ్ కరన్, ఓలీ రాబిన్సన్ బ్యాట్ ఝులిపించగలరు. బౌలింగ్ విభాగంలో జేమ్స్ అండర్సన్కు జతగా సామ్ కరన్, ఓలీ రాబిన్సన్ ఉంటారు. గాయంతో తప్పుకున్న స్టార్ పేసర్ మార్క్ వుడ్ స్థానంలో సకీబ్ మహమూద్ ఆడనున్నాడు. మొత్తానికి ఇంగ్లండ్ పటిష్ట జట్టుతో బరిలోకి దిగనుంది. విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతామని ఇప్పటికే ఇంగ్లండ్ కోచ్ చెప్పాడు.

ఇంగ్లండ్ తుది జట్టు (అంచనా)
రోరీ బర్న్స్, హసీబ్ హమీద్, డేవిడ్ మలాన్, జో రూట్ (కెప్టెన్), జానీ బెయిరిస్టో, జోస్ బట్లర్ (కీపర్), మొయిన్ అలీ, సామ్ కరన్, ఓలీ రాబిన్సన్, సకీబ్ మహమూద్, జేమ్స్ అండర్సన్.


Click it and Unblock the Notifications
