అయిదు టెస్టుల సిరీస్లో మరో సమరానికి భారత్, ఇంగ్లండ్ సిద్ధమయ్యాయి. రాంచీ వేదికగా రేపటి నుంచి నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. టీమిండియాతో జరగనున్న ఈ టెస్టుకు ఇంగ్లండ్ తమ తుది జట్టును గురువారమే ఇంగ్లండ్ ప్రకటించింది. గత మూడు టెస్టుల ప్రారంభానికి ఒక్కరోజు ముందుగానే తుదిజట్టును వెల్లడించిన ఇంగ్లిష్ జట్టు అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది.
అయితే రాంచీ టెస్టు తుదిజట్టులో ఇంగ్లండ్ కీలక మార్పులు చేసింది. బ్యాటుతో కూడా సత్తాచాటే ఇద్దరు బౌలర్లు జట్టులో స్థానం కోల్పోయారు. మార్క్ వుడ్, రెహాన్ అహ్మద్ను జట్టు నుంచి తప్పించింది. వారిద్దరి స్థానంలో షోయబ్ బషీర్, ఒలీ రాబిన్సన్ జట్టులోకి వస్తున్నారు. రాబిన్సన్కు ఈ సిరీస్లో రాంచీ టెస్టు తొలి మ్యాచ్ కానుంది. అండర్సన్తో కలిసి అతను పేస్ బాధ్యతలు పంచుకోనున్నాడు.

మరోవైపు యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ వైజాగ్ మ్యాచ్తో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. కానీ మూడో టెస్టుకు అతడిని తప్పించారు. కాగా, తుది జట్టులో చోటు కోల్పోయిన రెహాన్ అహ్మద్, మార్క్ వుడ్ ఇద్దరూ బంతితో పాటు బ్యాటుతో ఆకట్టుకునేవారే. రాజ్కోట్ టెస్టులో రెహాన్ మూడు వికెట్లు, మార్క్ వుడ్ నాలుగు వికెట్లు తీశారు. కానీ ఛేదనలో వుడ్ 15 బంతుల్లో 33 పరుగులు చేశాడు. రెహాన్ గొప్పగా పరుగులు చేయనప్పటికీ నైట్వాచ్మన్గా వస్తూ క్రీజులో కీలక సమయాన్ని ఎదుర్కొంటాడు.
తొలి రెండు టెస్టుల్లో ఒక్క పేసర్తోనే బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఆ తర్వాత నుంచి తమ వ్యూహాన్ని మార్చుకుంది. ఉప్పల్ టెస్టులో మార్క్ వుడ్ను, వైజాగ్ టెస్టులో అండర్సన్ను జట్టులోకి తీసుకున్నారు. మూడో టెస్టులో వారిద్దరు తుది జట్టులోకి వచ్చారు. కాగా, రాంచీ పిచ్పై ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ స్పందిస్తూ.. రాంచీ పిచ్ గురించి ఎలాంటి అభిప్రాయానికి రాలేకపోతున్నామని వాపోయాడు. ఈ వికెట్పై ఎలా ఆడాలో తెలియట్లేదని, పిచ్పై పచ్చికతో పాటు పగుళ్లు కూడా ఉన్నాయని అన్నాడు. ఇంతకుముందు ఇలాంటి పిచ్ను ఎప్పుడూ చూడలేదని తెలిపాడు.
ఇంగ్లండ్ తుది జట్టు:
జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, జానీ బెయిర్స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), షోయబ్ బషీర్, టామ్ హర్ట్లీ, ఒలీ రాబిన్సన్, జేమ్స్ అండర్సన్.
భారత తుది జట్టు (అంచనా):
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్మన్ గిల్, రజత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్, మహ్మద్ సిరాజ్, అకాశ్ దీప్/ముకేశ్ కుమార్