IND vs ENG: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో మొదటిరోజునే వివాదం చెలరేగింది. ఈ వివాదానికి కేంద్ర బిందువు కుమార్ ధర్మసేన వ్యవహారశైలి వివాదానికి మూలబిందువుగా మారింది. ఆయన ఇంగ్లాండ్ జట్టుకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారని, ఇది నిబంధనలకు విరుద్ధమని సోషల్ మీడియాలో అభిమానులు తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ సంఘటన ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
మైదానంలో ఏం జరిగిందంటే?
లండన్లోని చారిత్రాత్మక ఓవల్ మైదానంలో జరుగుతున్న ఈ టెస్ట్ మ్యాచ్ లోని మొదటి రోజు ఆటలో భారత ఇన్నింగ్స్ 13వ ఓవర్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జోష్ టంగ్ వేసిన ఒక బంతి భారత బ్యాటర్ సాయి సుదర్శన్ ప్యాడ్కు తగిలింది. దీంతో ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఎల్బీడబ్ల్యూ కోసం గట్టిగా అప్పీల్ చేశారు. అయితే క్రీజులో అంపైర్గా ఉన్న కుమార్ ధర్మసేన ఆ అప్పీల్ను తిరస్కరించి, బంతి ఔట్ కాదని తల ఊపారు.

వివాదం ఎందుకు రేగింది?
అసలు సమస్య ఇక్కడే మొదలైంది. డీఆర్ఎస్ తీసుకోవడానికి ఇంగ్లాండ్ జట్టుకు 15 సెకన్ల సమయం ఉంది. ఈ కీలకమైన సమయంలో అంపైర్ ధర్మసేన తన వేళ్లతో ఒక సైగ చేశారు. ఆయన సైగ బంతి బ్యాట్కు తగిలిందని సూచిస్తున్నట్లుగా కనిపించింది. అంపైర్ చేసిన ఈ సైగను గమనించిన ఇంగ్లండ్ జట్టు ఆ బంతికి డీఆర్ఎస్ తీసుకోకూడదని నిర్ణయించుకుంది. తర్వాత టీవీ రీప్లేలలో బంతి స్పష్టంగా సాయి సుదర్శన్ ప్యాడ్ కు తగిలిందని, అది ఔట్ అయ్యే అవకాశం ఉందని తేలింది. దీని ద్వారా ధర్మసేన ఇచ్చిన నాటౌట్ నిర్ణయం సరైనదని ధ్రువీకరించబడింది.
అంపైర్ నిర్ణయం సరిగ్గా ఉన్నప్పటికీ, ఆయన డీఆర్ఎస్ కాలపరిమితి ముగిసేలోపు సైగ చేయడం ప్రధాన వివాదానికి కారణం. ఒకవేళ ధర్మసేన ఆ సైగ చేసి ఉండకపోతే, ఇంగ్లాండ్ జట్టు డీఆర్ఎస్ తీసుకునే అవకాశం ఉండేది. ఆ డీఆర్ఎస్ వారికి ఒక రివ్యూను కోల్పోయేలా చేసేది. ఇది ఇంగ్లాండ్ జట్టుకు ప్రతికూలంగా, భారత జట్టుకు అనుకూలంగా ఉండేది. కానీ అంపైర్ ధర్మసేన చేసిన ఆ సైగ వల్ల ఇంగ్లాండ్కు ఒక విలువైన రివ్యూ ఆదా అయ్యింది. దీనిని భారత జట్టుకు ప్రతికూలంగా, ఇంగ్లాండ్కు అనుకూలంగా జరిగిన చర్యగా పరిగణిస్తున్నారు.
క్రికెట్ నిబంధనల ప్రకారం.. ఒక అంపైర్ తన నిర్ణయానికి గల కారణాన్ని, ముఖ్యంగా డీఆర్ఎస్ అవకాశం ఉన్నప్పుడు, క్రీజులో ఉన్న ఆటగాళ్లకు తెలియజేయకూడదు. ఎందుకంటే ఇది ఆట నిష్పక్షపాత నిర్ణయాలను ప్రభావితం చేయవచ్చు. ఒక జట్టుకు అనవసరమైన ప్రయోజనాన్ని చేకూర్చవచ్చు.
మాజీ ఆటగాళ్ల అభిప్రాయాలు
ఈ సంఘటనపై పలువురు మాజీ క్రికెటర్లు తీవ్రంగా స్పందించారు. భారత జట్టు మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ మాట్లాడుతూ.. "ధర్మసేన తన పాత అలవాటు కారణంగా ఇలా చేసి ఉండవచ్చు. ఆయన అంపైరింగ్ చేయడం ప్రారంభించిన సమయంలో డీఆర్ఎస్ వ్యవస్థ లేదు. కానీ ప్రస్తుత పరిస్థితులలో అంపైర్లు తమ మనసులో ఉన్నదాన్ని సైగ ద్వారా చూపించకూడదు. ఇది బౌలింగ్ జట్టుకు ఒక సూచన ఇస్తుంది. ఆయన అలా చేసి ఉండకూడదు." అని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.
మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్ మైఖేల్ అథర్టన్ కూడా ఈ విషయంపై స్పందించారు. కామెంటరీ సమయంలో.. "ఇంగ్లాండ్ తమ రివ్యూలను వృథా చేసుకోవాలని ఇండియా కోరుకుంటుంది" అని పేర్కొన్నారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపింది. చాలా మంది అభిమానులు ధర్మసేన చర్యను తీవ్రంగా విమర్శిస్తూ, ఇది నిష్పక్షపాతానికి విరుద్ధమని పోస్ట్ చేస్తున్నారు.