ఇంగ్లండ్తో జరిగిన అయిదు టెస్టుల సిరీస్లో భారత్ 4-1తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. తొలి టెస్టులో ఓటమి, కీలక ఆటగాళ్లు దూరం.. ఇలాంటి ప్రతికూలాంశాలు అధిగమించి టీమిండియా ఘన విజయం సాధించింది. అయితే స్వదేశంలో ప్రత్యర్థిపై విజయం సాధించడాన్ని తేలికగా తీసుకోకూడదని టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ పేర్కొన్నాడు. గతంతో పోలిస్తే ఐపీఎల్ పుణ్యమా ప్రత్యర్థి ఆటగాళ్లకు భారత్లోని పరిస్థితులపై అవగాహన వచ్చిందని, కానీ ఇంగ్లండ్ సత్తాచాటలేదని ద్రవిడ్ తెలిపాడు.
''స్వదేశంలో టెస్టు విజయాలను కొన్నిసార్లు తేలికగా తీసుకుంటాం. కానీ విదేశీ ఆటగాళ్లకు భారత్లో అనుభవం ఉన్నప్పటికీ గత పదేళ్లుగా టీమిండియానే ఆధిపత్యం చెలాయిస్తోంది. 1980-90ల్లో, 2000 ప్రారంభంలో ఇంగ్లిష్ ప్లేయర్లకు ఈ అవకాశం లేదు. ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత ప్రత్యర్థి ఆటగాళ్లకు అవకాశాలు వస్తున్నాయి. ఎంతోమంది ఆటగాళ్లు ఇండియాలో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. ఐపీఎల్ విభిన్నమైన ఫార్మాట్ అయినప్పటికీ ఇక్కడి పరిస్థితులు, భారత్ గురించి వాళ్లు తెలుసుకోవచ్చు''

''కానీ మా ఆటగాళ్లకు ఈ ఛాన్స్ లేదు. విదేశీ అనుభవాన్ని పొందలేరు. ఆస్ట్రేలియాకు పర్యటన కోసం వెళ్లేవరకు మా యువ ఆటగాళ్లకు అక్కడి పరిస్థితులు గురించి తెలియదు. కానీ ఆస్ట్రేలియా, ఇంగ్లిష్ ప్లేయర్లు ఇండియాలో ఎంతోకాలంగా ఉంటున్నారు.అయినప్పటికీ మేం సత్తాచాటుతూ రికార్డును కొనసాగిస్తున్నామంటే మా ఆటగాళ్ల టాలెంట్ వల్లే. ఇది అంత ఈజీ కాదు. అయితే కొంతమంది ఈ విజయాలను తేలికగా తీసుకుంటున్నారు. కానీ మా ఆటగాళ్లు ప్రతిభ, శ్రమను గుర్తించాలి''
''సెలక్టర్లకు కూడా సరైన గుర్తింపు దక్కట్లేదు. మేం దేశవాళీ క్రికెట్ను చూడలేం. కానీ జట్టులోని ఖాళీలను యువకులతో భర్తీచేయాలంటే సెలక్టర్లపై ఆధారపడాలి. వాళ్లు అవసరాలకు తగ్గట్లుగా ఆటగాళ్లను ఎంపిక చేస్తూ మమ్మల్ని గైడ్ చేస్తారు. ఈ విషయంలో అజిత్ అగార్కర్ టీమ్కు క్రెడిట్ దక్కాలి. అలాగే టీమిండియా-ఏ జట్టు ఆటగాళ్లకు గుర్తింపు దక్కాలి. వాళ్లు అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్కు వారధిగా ఉంటున్నారు.'' అని ద్రవిడ్ అన్నాడు.