టీమిండియా యువ వికెట్కీపర్ తన కెరీర్లో నిలిచిపోయే గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. 90 పరుగుల వద్ద ఔటై సెంచరీ చేజార్చుకున్నప్పటికీ విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. రాంచీ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత జట్టును ధ్రువ్ జురెల్ ఆదుకున్నాడు. 177 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన టీమిండియాను 307 పరుగుల స్కోరుకు తీసుకువచ్చాడు.
టెయిలెండర్లతో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. కుల్దీప్ యాదవ్ (28; 131 బంతుల్లో)తో కలిసి ధ్రువ్ జురెల్ ఎనిమిదో వికెట్కు 76 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కుల్దీప్ ఔటైన అనంతరం అరంగేట్ర ప్లేయర్ ఆకాశ్ దీప్ (9; 29 బంతుల్లో)తో కలిసి తొమ్మిదో వికెట్కు 40 పరుగులు జోడించాడు. 149 బంతులు ఎదుర్కొన్న ధ్రువ్ 90 పరుగులు సాధించాడు. ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాదాడు.

అయితే హాఫ్ సెంచరీ సాధించిన తర్వాత ధ్రువ్ జురెల్ సెల్యూట్ చేస్తూ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. దానికో ప్రత్యేక కారణం ఉంది. దేశం కోసం ధ్రువ్ జురెల్ మైదానంలో పోరాడుతుంటే తన తండ్రి నీమ్ సింగ్ జురెల్ సరిహద్దుల్లో పోరాడారు. నీమ్ సింగ్ ఆర్మీలో పనిచేసేవారు. ఆయన కార్గిల్ యుద్ధంలో పోరాడారు. సైనిక కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ధ్రువ్.. దానికి గుర్తుగా, అలాగే తన తండ్రికి అంకితంగా అర్ధశతకం అనంతరం ఇలా సెల్యూట్తో సంబరాలు చేశాడు.
అయితే ధ్రువ్ జురెల్ ప్రయాణం అంత సాఫీగా సాగలేదు. తన తండ్రిని కష్టపడి ఒప్పించాడు. క్రికెట్ కెరీర్ కోసం తన తల్లి బంగారాన్ని అమ్మి ముందుకు సాగాడు. పట్టుదలతో పోరాడుతూ 2020 అండర్ 19 ప్రపంచకప్లో టీమిండియాకు ఎంపికయ్యాడు. ఆ టోర్నీలో తన వికెట్ కీపింగ్ స్కిల్స్తో అందర్నీ ఆకర్షించాడు.
అనంతరం గతేడాది ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన ధ్రువ్ జురెల్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగి ఫినిషర్ పాత్రను సమర్థవంతంగా పోషించాడు. 172.73 స్ట్రైక్ రేట్తో 152 పరుగులు చేశాడు. ఇక 2022లో దేశవాళీ క్రికెట్లోకి అడుగుపెట్టిన ధృవ్ జురెల్.. జూనియర్ లెవల్లో 15 రెడ్ బాల్ మ్యాచ్ల్లో 46.47 సగటుతో 790 రన్స్ చేశాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. లిస్ట్ ఏ క్రికెట్లో ఏడు ఇన్నింగ్స్ల్లో 47.25 సగటుతో 244 రన్స్ చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఇటీవల భారత్ ఏ తరఫున సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లిన జురెల్ రెండో మ్యాచ్ల్లో 69 పరుగులతో సత్తా చాటాడు. ఏసీసీ ఎమర్జింగ్ ఆసియా కప్ టోర్నీలోనూ సత్తా చాటాడు. అయితే ఇంగ్లండ్ టెస్టు సిరీస్లో కేఎస్ భరత్ విఫలమవ్వడంతో ధ్రువ్కు ఛాన్స్ వచ్చింది. ఈ అవకాశాన్ని ధ్రువ్ గొప్పగా సద్వినియోగం చేసుకుంటున్నాడు.