రాజ్కోట్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ విజయం దిశగా దూసుకెళ్తోంది. 557 పరుగుల భారీ లక్షంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 50 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయింది. బెన్ డకెట్ (4; 15 బంతుల్లో), జాక్ క్రాలే (11; 26 బంతుల్లో), ఒలీ పోప్ (3; 14 బంతుల్లో), జానీ బెయిర్స్టో (4; 3 బంతుల్లో), జో రూట్ (7; 40 బంతుల్లో) వరుసగా పెవిలియన్కు చేరారు. రవీంద్ర జడేజా మూడు వికెట్లు, బుమ్రా ఒక వికెట్ పడగొట్టారు.
అయితే ఇంగ్లండ్ తొలి వికెట్ రనౌట్ రూపంలో కోల్పోయింది. ఏడో ఓవర్లో బుమ్రా వేసిన తొలి బంతిని మిడ్వికెట్ మీదగా డకెట్ డిఫెండ్ షాట్ ఆడాడు. ఆ తర్వాత సింగిల్కు ప్రయత్నించాడు. సగం పిచ్ వరకు పరిగెత్తాడు. కానీ మరో ఎండ్లో ఉన్న క్రాలే పరుగుకు నిరాకరించడంతో తిరిగి వెనక్కి పరిగెత్తాడు. ఈ లోపు సిరాజ్ ఒంటిచేత్తో బంతిని అందుకుని మెరుపు వేగంతో త్రో వేశాడు.

మరోవైపు సిరాజ్ గురిపెట్టి విసిరిన స్టంప్స్ వెనుక బంతిని అందుకోవడానికి ఏ ఫీల్డర్ లేరు. దీంతో బుమ్రా బౌలింగ్కు చాలా దూరంలో వికెట్కీపింగ్ చేస్తున్న ధ్రువ్ జురెల్ పరిగెత్తుకువచ్చాడు. సూపర్ మ్యాన్లా వచ్చి కష్టమైన ఆ త్రోను అందుకొని డైవ్ చేస్తూనే వికెట్లను గిరాటేశాడు. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. ఆ రనౌట్ తర్వాత ఇంగ్లండ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఇంగ్లండ్ 50/5 స్కోరు చేసింది. క్రీజులో స్టోక్స్ (15*), బెన్ ఫోక్స్ ఉన్నారు.
అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 196/2తో ఇవాళ ఆటను ఆరంభించిన టీమిండియా నాలుగు వికెట్లకు 430 పరుగులు చేసి రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. యశస్వీ జైస్వాల్ (214*; 236 బంతుల్లో), శుభ్మన్ గిల్ (91; 154 బంతుల్లో), సర్ఫరాజ్ ఖాన్ (68*; 72 బంతుల్లో) సత్తాచాటారు.
నైట్వాచ్మన్ కుల్దీప్ యాదవ్ (27; 91 బంతుల్లో)తో కలిసి గిల్ స్కోరుబోర్డు నడిపించాడు. చెత్తబంతుల్ని బౌండరీకి తరలిస్తూ వీరిద్దరు పరుగులు సాధించారు. అయితే సెంచరీ దిశగా సాగుతున్న గిల్ దురదృష్టవశాత్తు రనౌటయ్యాడు. కుల్దీప్ అనవసరపు పరుగుకు ప్రయత్నించి నో చెప్పడంతో గిల్ వెనుదిరిగాడు. కాసేపటికే కుల్దీప్ కూడా ఔటయ్యాడు. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన యశస్వీ జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్ టీ20 తరహాలో బ్యాటింగ్ చేశారు.
అయిదో వికెట్కు అజేయంగా 172 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో జైస్వాల్ 231 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో రెహాన్ అహ్మద్, జో రూట్, టామ్ హర్ట్లీ తలో వికెట్ తీశారు. రోహిత్ శర్మ (19) పరుగులు చేశాడు.