ధర్మశాల వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఆఖరి టెస్టులో టీమిండియా ఆధిపత్యం చెలాయిస్తుంది. రెండో రోజు ఆట ముగిసేసరికి భారత్ ఎనిమిది వికెట్లు కోల్పోయి 473 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇంగ్లండ్ కంటే 255 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. శుభ్మన్ గిల్ (110), రోహిత్ శర్మ (103), దేవదత్ పడిక్కల్ (65), సర్ఫరాజ్ ఖాన్ (56) రాణించారు.
యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ విఫలమయ్యాడు. 24 బంతుల్లో 15 పరుగులు చేసి పెవిలియన్కు చేరాడు. షోయబ్ బషీర్ బౌలింగ్లో సిక్సర్కు ట్రై చేసి లాంగాన్లో బౌండరీలైన్లో ఉన్న బెన్ డకెట్ చేతికి చిక్కాడు. అయితే ధ్రువ్ జురెల్ భారీ షాట్కు ట్రై చేసి వికెట్ చేజార్చుకోవడంపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాట్లాడాడు. అర్థంలేని షాట్ ధ్రువ్ ఆడాడని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. అలా ఆడినందుకు ధ్రువ్ జురెల్ చాలా బాధపడి ఉంటాడని అన్నాడు.

''ఆ షాట్ ఆడినందుకు ధ్రువ్ జురెల్ చాలా నిరాశ చెంది ఉంటాడు. అదే జరిగింది. ఆ షాట్ బ్యాటు చివరన తగిలింది. అయితే ధ్రువ్ కాసేపు ముందే బ్యాటింగ్కు వచ్చాడు. 24 బంతులే ఎదుర్కొన్నాడు. మరోఎండ్లో రవీంద్ర జడేజా ఉన్నాడు. అలాగే బౌండరీ లైన్లో ఫీల్డర్లు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ధ్రువ్ అలాంటి షాట్ ఆడి ఉండకూడదు. ఈ విషయంలో ధ్రువ్ బాధపడటంలో ఆశ్చర్యమేమి లేదు. అతడు నేర్చుకుంటున్నాడు.అన్నిసార్లు భారీ షాట్కు ప్రయత్నించవద్దు. ముఖ్యంగా టెస్టు క్రికెట్లో ఇది కరెక్ట్ కాదు'' అని గవాస్కర్ అన్నాడు.
సర్ఫరాజ్ ఖాన్ ఔటైన తీరుపై కూడా గవాస్కర్ స్పందిచాడు. చెత్త షాట్ ఆడి సర్ఫరాజ్ పెవిలియన్కు చేరాడని గవాస్కర్ అన్నాడు. విరామం తర్వాత దూకుడుగా ఆడటానికి కాస్త సమయం తీసుకోవాలని సూచించాడు. దిగ్గజ క్రికెటర్ డాన్ బ్రాడ్మన్ మాటలు గుర్తుచేసుకోవాలని, డబుల్ సెంచరీ సాధించినా బ్రేక్ తర్వాత జీరో స్కోరుతో మొదలుపెట్టామని బ్యాటర్లు భావించాలని గవాస్కర్ పేర్కొన్నాడు. టీ విరామం అనంతరం తొలి బంతికే కట్ షాట్ ఆడబోయిన సర్ఫరాజ్ షోయబ్ బషీర్ బౌలింగ్లో రూట్ చేతికి చిక్కాడు.