రాంచీ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా పోరాడుతోంది. రెండో రోజు ఆట ముగిసేసరికి తొలి ఇన్నింగ్స్లో 73 ఓవర్లలో భారత్ ఏడు వికెట్లకు 219 పరుగులు చేసింది. ప్రత్యర్థి కంటే 134 పరుగుల వెనుకంజలో ఉంది. క్రీజులో ధ్రువ్ జురెల్ (30*; 58 బంతుల్లో), కుల్దీప్ యాదవ్ (17*; 72 బంతుల్లో) ఉన్నారు. మొదటి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 353 పరుగులు చేసింది.
ఓవర్నైట్ స్కోరు 302/7 తో శనివారం ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ మరో 51 పరుగులు చేసి చివరి మూడు వికెట్లు కోల్పోయింది. స్టార్ బ్యాటర్ జో రూట్ (122*; 274 బంతుల్లో) అజేయంగా నిలిచాడు. రాబిన్సన్ (58; 96 బంతుల్లో)తో కలిసి రూట్ ఎనిమిదో వికెట్కు శతక భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ఆ తర్వాత జడేజా ఇంగ్లండ్ టెయింలెండర్లను వరుసగా పెవిలియన్కు చేర్చాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు, ఆకాశ్ దీప్ మూడు, సిరాజ్ రెండు, అశ్విన్ ఒక వికెట్ తీశారు.

అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్కు ఆదిలోనే షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ (2; 9 బంతుల్లో)ను అండర్సన్ బోల్తాకొట్టించాడు. వన్డౌన్లో వచ్చిన శుభ్మన్ గిల్ (38; 65 బంతుల్లో)తో కలిసి యశస్వీ జైస్వాల్ (73; 117 బంతుల్లో) ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. వీరిద్దరు రెండో వికెట్కు 84 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కానీ అంపైర్ కాల్తో గిల్ పెవిలియన్కు చేరాడు. కాసేపటికే రజత్ పటిదార్ (17; 42 బంతుల్లో), రవీంద్ర జడేజా (12; 12 బంతుల్లో) ఔటయ్యారు.
మరోవైపు యశస్వీ జైస్వాల్ సాధికారికంగా బ్యాటింగ్ చేస్తూ 89 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. సర్ఫరాజ్ (14; 53 బంతుల్లో)తో కలిసి ఇన్నింగ్స్ పునర్నిర్మాణం చేయడానికి ప్రయత్నించాడు. కానీ చక్కని బంతితో జైస్వాల్ను షోయబ్ బషీర్ బోల్తాకొట్టించాడు. అదే జోరులో ఇంగ్లండ్ మరో రెండు వికెట్లు తీసింది. దీంతో 177 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
కానీ, కుల్దీప్ యాదవ్తో కలిసి ధ్రువ్ జురెల్ జట్టును ఆదుకున్నాడు. వీరిద్దరు ఎనిమిదో వికెట్కు అభేద్యంగా 42 పరుగులు జోడించారు. బౌలర్ అయిన కుల్దీప్ బ్యాటింగ్లోనూ సత్తాచాటడం విశేషం. క్రీజులోకి రావడంతోనే రివర్స్ స్వీప్తో ఫోర్ బాదాడు. ఆ తర్వాత సాలిడ్ డిఫెన్స్తో వికెట్ల వేటను అడ్డుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ నాలుగు వికెట్లు, టామ్ హర్ట్లీ రెండు, అండర్సన్ ఒక వికెట్ తీశారు.