
లండన్: భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య నాటింగ్హామ్లోని ట్రెంట్బ్రిడ్జ్ వేదికగా సాగుతోన్న తొలి టెస్ట్ మ్యాచ్.. రెండో రోజే రసవత్తరంగా మారింది. రెండు జట్లలోనూ బౌలర్లు విజృంభించారు. వాతావరణంలో ఉన్న తేమను సద్వినియోగం చేసుకున్నారు. బ్యాట్స్మెన్లను కట్టడి చేశారు. స్వింగ్లతో రెచ్చిపోయారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 183 పరుగులకే కుప్పకూలిపోగా.. కోహ్లీసేన కూడా అదే పరిస్థితిలో ఉంది. 58 పరుగులు వెనుకే ఉండగా.. నాలుగు కీలకమైన వికెట్లను చేజార్చుకుంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ సత్తా చాటినప్పటికీ.. టాప్ ఆర్డర్ టపటపా మంటు పడిపోయింది.
విరాట్ కోహ్లీ గోల్డెన్ డక్ సాధించాడు. నయా వాల్గా గుర్తింపు పొందిన చేతేశ్వర్ పుజారా నాలుగు పరుగులకే అవుట్ అయ్యాడు. అజింక్య రహానె వ్యక్తిగత స్కోరు అయిదు పరుగుల వద్ద ఉండగా.. జానీ బెయిర్స్టో చేసిన రనౌట్కు పెవిలియన్ చేరాడు. పడిన ఈ నాలుగు వికెట్లలో రెండు అండర్సన్ ఖాతాలో చేరాయి. మరో వికెట్ రాబిన్సన్ పడగొట్టాడు.బ్యాడ్ లైట్, వర్షం వల్ల రెండో రోజు ఆట అర్ధాంతరంగా ముగిసింది. టెస్ట్ మ్యాచుల్లో అతనికి ఇది 12వ అర్ధసెంచరీ. 61 ఇన్నింగ్స్లల్లో 12 హాఫ్ సెంచరీలను సాధించాడీ కర్ణాటక బ్యాట్స్మెన్.
ఆట ముగిసే సమయానికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 57 పరుగులతో క్రీజ్లో ఉన్నాడు. రిషభ్ పంత్ ఏడు పరుగులతో నాటౌట్గా నిలిచాడు. సరిగ్గా ఇక్కడే వరుణుడు కీలక పాత్ర పోషించేటట్టు కనిపిస్తోంది. వర్షం వల్ల మ్యాచ్ అర్ధాంతరంగా ముగియగా.. మూడో రోజు కూడా అదే పరిస్థితి నెలకొంది. మూడో రోజు ట్రెంట్బ్రిడ్జ్లో వర్షం పడే అవకాశం ఉన్నట్లు బ్రిటన్ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.
కొన్ని గంటల పాటు మాత్రమే మ్యాచ్ కొనసాగుతుందనే అంచనాలు ఉన్నాయి. మధ్యమధ్యలో వాన వెలిసిప్పటికీ.. వర్షం పడటం వల్ల అవుట్ ఫీల్డ్ చిత్తడిగా మారొచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. అదే సమయంలో- వెలుతురు లేమి కూడా మ్యాచ్పై ప్రభావం చూపుతుందని తెలుస్తోంది. వెలుతురు లేమి కారణంగా రెండో రోజు మూడో సెషన్లో మ్యాచ్ కొద్దిసేపు నిలిపివేసిన విషయం తెలిసిందే. 33.4 ఓవర్ల ఆట మాత్రమే సాగింది.
అదే పరిస్థితి మూడో రోజు తొలి సెషన్ నుంచే ఉండొచ్చని తెలుస్తోంది. పూర్తిస్థాయిలో మ్యాచ్ కొనసాగడానికి వీలుగా వాతావరణం సహకరించకుండా పోయే అవకాశాలు అధికంగా ఉన్నట్లు కనిపిస్తోంది.. బ్రిటన్ వాతావరణ విభాగం అధికారుల అంచనాలను బట్టి చూస్తోంటే. కాగా- మూడో రోజు మొదటి సెషన్ ఆరంభమైంది. వర్షం కారణంగా కొంత ఆలస్యంగా మ్యాచ్ మొదలైంది. బ్యాట్స్మెన్లు రాణిస్తోన్నారు.
వర్షం వల్ల అర్ధాంతరంగా నిలిపివేసిన రెండో రోజు నాటి ఓవర్ను అండర్సన్ పూర్తి చేశాడు. అనంతరం రాబిన్సన్ బౌల్ చేశాడు. పరుగులేమి ఇవ్వలేదు. అనంతరం అండర్సన్ మరో ఓవర్ వేశాడు. ఇందులో ఒక ఫోర్ సహా ఆరు పరుగులొచ్చాయి. ఈ దశలో చినుకులు పడటంతో మ్యాచ్ స్వల్పంగా అంతరాయం ఏర్పడింది. మళ్లీ మొదలైంది. గ్రౌండ్ స్టాఫ్ పిచ్ను కవర్ చేశారు.
కాగా, ఇంగ్లాండ్లోనే జూన్లో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య ముగిసిన ప్రపంచకప్ టెస్ట్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్లో వరుణుడు ఎంత కీలక పాత్ర పోషించాడనేది మనకు తెలిసిన విషయమే. వర్షం వల్ల ఏకంగా రెండు రోజుల పాటు మ్యాచ్ పూర్తిగా రద్దయింది. అయినప్పటికీ- న్యూజిలాండ్ ఈ మ్యాచ్ను తన సొంతం చేసుకుంది. అతి తక్కువ సెషన్లలోనే పక్కా బ్యాటింగ్, బౌలింగ్తో కోహ్లీసేనపై విజయాన్ని సాధించింది కివీస్ టీమ్. ఇప్పుడు కూడా నాటింగ్ హామ్ ట్రెంట్బ్రిడ్జ్లో దాదాపుగా అదే తరహా వాతావరణం నెలకొని ఉంది. వాతావరణం సహకరించి.. మ్యాచ్ కొనసాగిస్తే భారత్ ఆధిక్యతను సాధించడానికి అవకాశం ఉంది.