
నాటింగ్హమ్: ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 278 పరుగులకు ఆలౌటైంది. చివర్లో పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (28; 34 బంతుల్లో 3x4, 1x6) బౌండరీల వర్షం కురిపిస్తూ విలువైన పరుగులు అందించాడు. దీంతో భారత్కు 95 పరుగుల కీలక ఆధిక్యం దక్కింది. మరో పేసర్ మొహ్మద్ సిరాజ్(7) నాటౌట్గా నిలిచాడు. కేఎల్ రాహుల్ (84; 214 బంతుల్లో 12x4) సెంచరీ చేజార్చుకోగా.. రవీంద్ర జడేజా (56; 86 బంతుల్లో 8x4, 1x6) సూపర్ ఫిఫ్టీ బాదాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఓలి రాబిన్సన్ ఐదు, జేమ్స్ అండర్సన్ నాలుగు వికెట్లు తీశారు.
శుక్రవారం 125/4 ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్ మరో 153 పరుగులు చేసి మిగిలిన ఆరు వికెట్లు కోల్పోయింది. తొలుత మ్యాచ్ ప్రారంభమైన రెండో ఓవర్లోనే వర్షం కురవడంతో గంట పాటు ఆట నిలిచిపోయింది. ఈ క్రమంలోనే కేఎల్ రాహుల్, రిషబ్ పంత్(25) నెమ్మదిగా ఆడి ఇంగ్లండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. అయితే దూకుడుగా ఆడే క్రమంలో పంత్.. ఓలి రాబిన్సన్ బౌలింగ్లో ఔటయ్యాడు. అప్పటికి జట్టు స్కోర్ 145/5గా నమోదైంది. దాంతో టీమిండియా మ్యాచ్ ఆరంభంలోనే కష్టాల్లో పడింది. ఇక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కష్టమనే భావన అందరిలోనూ కలిగింది.
రిషబ్ పంత్ అనంతరం స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా క్రీజులోకి వచ్చి చక్కగా బ్యాటింగ్ చేశాడు. కేఎల్ రాహుల్కు అండగా నిలబడ్డాడు. అంతేకాదు బౌండరీలు బాదుతూ ఇంగ్లీష్ బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. ఈ క్రమంలోనే ఇద్దరూ కలిసి భోజన విరామ సమయానికి 46 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్లో ఆధిక్యంలో నిలిచింది. రాహుల్, జడేజాలు స్వల్ప వ్యవధిలో ఔటయ్యాక.. చివర్లో మహ్మద్ షమీ (11), జస్ప్రీత్ బుమ్రా వేగంగా పరుగులు తీశారు. ముఖ్యంగా బుమ్రా బౌండరీలతో అలరించాడు. దీంతో భారత్ 278 పరుగులు చేసింది. అంతకుముందు రెండో రోజు ఓపెనర్ రోహిత్ శర్మ (36) ఫర్వాలేదనిపించగా.. చేతేశ్వర్ పుజారా (4), కెప్టెన్ విరాట్ కోహ్లీ (0), వైస్ కెప్టెన్ అజింక్య రహానే (5) విఫలయ్యారు.పుజారా, కోహ్లీ ఒకే ఓవర్లో ఔట్ అవ్వగా.. రహానే మరికాసేపటికే రనౌట్ రూపంలో పెవిలియన్ చేరాడు. కేఎల్ రాహుల్తో సమన్వయ లోపం కారణంగా జింక్స్ ఔట్ అయ్యాడు.
ఇక ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ టెస్టు క్రికెట్లో అరుదైన రికార్డు నెలకొల్పాడు. భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే అత్యధిక వికెట్ల 619 రికార్డును జిమ్మీ బద్దలు కొట్టాడు. గురువారం పుజారా, కోహ్లీలను పెవిలియన్ చేర్చి.. కుంబ్లే సరసన నిలిచిన అండర్సన్ ఈరోజు ఠాకూర్ (0), రాహుల్ను ఔట్ చేసి జంబోను అధిగమించాడు. ముత్తుయ్య మురళీధరన్ 800 వికెట్లతో అందరికన్నా ముందుండగా.. ఆస్ట్రేలియా స్పిన్ మాంత్రికుడు షేర్న్వార్న్ 708 వికెట్లతో రెండో స్థానంలో నిలిచాడు. అండర్సన్ ప్రస్తుతం 621 వికెట్లతో ఉన్నాడు.