
నాటింగ్హామ్: ఐదు టెస్టుల సిరీస్ల్లో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మొదటి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్లో భారత్ వికెట్ కోల్పోకుండా 13 ఓవర్లలో 21 పరుగులు చేసింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (9), రోహిత్ శర్మ (9)లు క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ పరుగులకు భారత్ ఇంకా 162 పరుగులు వెనకబడిఉంది. అంతకుముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ టీమ్ని.. తొలి ఇన్నింగ్స్లో 183 పరుగులకే భారత్ బౌలర్లు కుప్పకూల్చారు. జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ షమీ మూడు తీశాడు. కెప్టెన్ జో రూట్ (64 పరుగులు) ఒక్కడే రాణించాడు. మిగతా బ్యాట్స్మెన్ పెద్దగా పరుగులు చేయలేకపోయారు.
బుధవారం ఆరంభం అయిన తొలి టెస్టులో టాస్ గెలిచి ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే స్టార్ ఓపెనర్ రోరీ బర్న్స్ డకౌట్గా వెనుదిరిగాడు. జస్ప్రీత్ బుమ్రా వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ ఐదో బంతికి బర్న్స్ ఎల్బీగా వెనుదిరిగాడు. అనంతరం డొమినిక్ సిబ్లీ నిదానంగా ఆడగా.. జాక్ క్రాలే కాస్త బ్యాట్ జులిపించాడు. అయితే మొహ్మద్ సిరాజ్ వేసిన 21 ఓవర్ చివరి బంతికి క్రాలే (27) క్యాచ్ ఔట్ అయ్యాడు. క్రాలే అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ జో రూట్ మంచి టచ్లో కనిపించాడు. వచ్చిరావడంతోనే వరుసగా మూడు ఫోర్లు బాదాడు. భోజన విరామ సమయానికి ఇంగ్లండ్ 25 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది.
లంచ్ బ్రేక్ అనంతరం సిబ్లీ ఔట్ అయినా.. జానీ బెయిర్స్టో అండతో రూట్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపాడు. బెయిర్స్టో తన మార్క్ షాట్లకు పోకుండా స్ట్రైక్ రొటేట్ చేస్తూ కెప్టెన్కు అండగా నిలబడ్డాడు. రూట్ చెత్త బంతులను మాత్రమే బౌండరీలకు పంపిస్తూ.. హాఫ్ సెంచరీ చేశాడు. షమీ వేసిన ఆ తర్వాతి ఓవర్లో బెయిర్స్టో (29) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఇదే సమయంలో అంపైర్లు టీ విరామం ప్రకటించారు. టీ విరామ సమయానికి ఇంగ్లండ్ 50.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 138 రన్స్ చేసింది.
టీ విరామ సమయానికి ఇంగ్లండ్ పటిష్ట స్థితిలోనే ఉంది. చివరి సెషన్లో బుమ్రా, షమీతో పాటు శార్దూల్ కూడా చెలరేగడంతో ఇంగ్లీష్ జట్టు కోలుకోలేకపోయింది. మూడో సెషన్లో ఇంగ్లండ్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. చివర్లో స్టార్ ఆల్రౌండర్ సామ్ కరన్ (27) కాసేపు బ్యాట్ ఝళిపించాడు. లేదంటే ఇంగ్లండ్ 150 పరుగులు కూడా చేసేది కాదు. ఇంగ్లండ్ ఆలౌట్ అనంతరం భారత్ తొలి ఇన్నింగ్స్ ఆరంభించింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలు క్రీజులో ఉన్నారు. ఆట ముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్లో భారత్ వికెట్ కోల్పోకుండా 21 పరుగులు చేసింది. మొత్తానికి తొలి రోజులో భారత్ ఆధిపత్యం చెలాయించింది. రెండో రోజులో ఓపెనర్లు మంచి ఆరంభం ఇస్తే టీమిండియాకు ఇక తిరుగుండదు.