
ఓవల్: ఐదు టెస్ట్ మ్యాచుల సిరీసులో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగవ టెస్టు రసవత్తరంగా సాగుతోంది. ఓవల్ మైదానంలో ఐదవ రోజున సోమవారం భోజన విరామ సమయానికి ఇంగ్లండ్ తన రెండో ఇన్నింగ్స్లో రెండు వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ఓపెనర్ హసీద్ హమీద్ (62), కెప్టెన్ జో రూట్ (8) రన్స్తో క్రీజ్లో ఉన్నారు. మరో ఓపెనర్ బర్న్స్ (50) హాఫ్ సెంచరీ చేసి శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో క్యాచ్ ఔటయ్యాడు. 27 ఓవర్ల పాటు సాగిన ఈ సెషన్లో భారత బౌలర్లు 54 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు తీశారు. వికెట్లు తీయడమే లక్ష్యంగా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేశారు. నాలుగో టెస్టులో విజయం సాధించడానికి భారత్ ఇంకా 8 వికెట్ల దూరంలో ఉంది. మరోవైపు ఇంగ్లండ్ విజయానికి 237 పరుగులు అవసరం.
ఓవర్ నైట్ స్కోర్ 77/0తో ఐదవ రోజు ఆట ఆరంభించిన ఇంగ్లండ్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. సరిగ్గా 100 పరుగుల వద్ద రోరీ బర్స్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. శార్దూల్ ఠాకూర్ బౌలింగులో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న బర్న్స్.. ఆ తర్వాతి బంతికే ఔట్ అయ్యాడు. కీపర్ రిషబ్ పంత్ అద్భుత క్యాచ్ అందుకున్నాడు. మరో బ్యాట్స్మెన్ హసీద్ హమీద్ 55 వ్యక్తిగత పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. రవీంద్ర జడేజా వేసిన 48వ ఓవర్లో భారీ షాట్ ఆడబోయిన హమీద్.. మొహ్మద్ సిరాజ్కి క్యాచ్ ఇచ్చాడు. సిరాజ్ దాన్ని నేలపాలు చేయడంతో అద్భుత అవకాశం చేజారింది.
ఇక క్రీజులో కుదురుకోవడానికి ప్రయత్నిస్తున్న హిట్టర్ డేవిడ్ మలన్ (5) త్వరగానే రన్ ఔటయ్యాడు. రవీంద్ర జడేజా వేసిన 53వ ఓవర్ మొదటి బంతికి సింగిల్ తీయడానికి ప్రయత్నిస్తూ మలన్ రన్ ఔట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ నిలకడగా ఆడుతున్నాడు. హమీద్ (62), రూట్ (8) రన్స్తో క్రీజ్లో ఉన్నారు. నాలుగో టెస్టులో విజయం సాధించడానికి భారత్ ఇంకా 8 వికెట్ల దూరంలో ఉంది. 368 టార్గెట్తో రెండవ ఇన్నింగ్స్ చేపట్టిన ఇంగ్లండ్ .. నాలుగవ రోజు వికెట్ నష్టపోకుండా 77 రన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ తొలి సెషన్లో 27 ఓవర్లలో మరో 54 రన్స్ జోడించి రెండు వికెట్లను కోల్పోయింది.
ఇంగ్లండ్ తన విక్టరీ కోసం 63 ఓవర్లలో 237 రన్స్ చేయాల్సి ఉంటుంది. అంటే 3.76 రన్ రేటు అవసరం ఉంది. మ్యాచ్ ఏ జట్టునైనా వరించే అవకాశాలు ఉన్నాయి. ఇరు జట్లకు ఇంకా ఆశలు సజీవంగా ఉన్నాయి. రాబోయే రెండు సెషన్లలో.. రసవత్తర పోరు తప్పేటట్టు లేదు. అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్లో 466 పరుగులకు ఆలౌటైంది. దాంతో ఇంగ్లండ్కు 368 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 191 పరుగులకు ఆలౌట్ కాగా.. 290 వద్ద ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఫలితంగా ఇంగ్లండ్కు 99 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.