IND vs ENG: ఇండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానం వేదికగా మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. తొలి రోజు భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. రిషబ్ పంత్ మైదానం వీడాల్సి వచ్చింది. పంత్ స్థానంలో ధ్రువ్ జురేల్ వికెట్ కీపంగ్ చేశాడు.
పంత్ స్థానంలో జురేల్ బ్యాటింగ్ చేయవచ్చా?
2019 వరకు క్రికెట్లో రీప్లేస్మెంట్ ప్లేయర్ నిబంధన లేదు. 2019లో ఐసీసీ కన్కషన్ సబ్స్టిట్యూట్ నిబంధనను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ఒక ఆటగాడికి తలకు గాయమైతే అతని స్థానంలో మరొక ఆటగాడిని ప్లేయింగ్ ఎలెవన్లో చేర్చుకోవచ్చు. జట్టులోకి వచ్చే ఆటగాడి పాత్ర బయటకు వెళ్లే ఆటగాడి పాత్రకు సమానంగా ఉండాలి. జట్లకు కొవిడ్ రీప్లేస్మెంట్ కూడా లభిస్తుంది. అయితే రిషబ్ పంత్కు తలకు గాయం కాలేదు. కొవిడ్ కూడా లేదు. రిషబ్ పంత్ వేలికి గాయమైంది. కాబట్టి ధ్రువ్ జురేల్ పంత్ స్థానంలో బ్యాటింగ్ లేదా బౌలింగ్ చేయలేడు. భారత జట్టుకు 10 మంది ఆటగాళ్లు మాత్రమే బ్యాటింగ్ చేయగలరు.

ఐసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయంటే?
ఐసీసీలోని సెక్షన్ 24.1.2 ప్రకారం.. "ఏ సబ్స్టిట్యూట్ ఆటగాడు బౌలింగ్, బ్యాటింగ్ లేదా కెప్టెన్సీ చేయలేడు. అంపైర్ల అనుమతితో మాత్రమే వికెట్ కీపర్గా వ్యవహరించగలడు." 2017 వరకు ఈ సబ్స్టిట్యూట్ వికెట్ కీపర్ నిబంధన కూడా లేదు. ఆ తర్వాత ఎంసీసీ తీవ్రమైన గాయం లేదా అనారోగ్యం విషయంలో సబ్స్టిట్యూట్ వికెట్ కీపర్ నిబంధనను ప్రవేశపెట్టింది. అయితే దీనికి అంపైర్ అనుమతి తప్పనిసరి. అయితే తీవ్రంగా గాయపడిన ఆటగాళ్ల రీప్లేస్మెంట్ నిబంధనను తీసుకురావడానికి ఐసీసీ ఇప్పుడు కృషి చేస్తోంది. ఐసీసీ అక్టోబర్ నుంచి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 6 నెలల ట్రయల్ ప్రారంభించనుంది. దీని ఫలితాలపై ఆధారపడి ఇది అంతర్జాతీయ క్రికెట్లో అమలు చేయబడుతుందా లేదా అనేది నిర్ణయించబడుతుంది.