
హెడ్డింగ్లీ: ఐదు టెస్ట్ మ్యాచుల సిరీసులో భాగంగా భారత్తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలిరోజు అట ముగిసేసమయానికి ఇంగ్లండ్ 42 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 120 రన్స్ చేసింది. ఓపెనర్లు రోరీ బర్న్స్ (52; 125 బంతుల్లో 5x4, 1x 6), హసీబ్ హమీద్ (60; 130 బంతుల్లో 11x4) హాఫ్ సెంచరీలు చేశారు. భారత్ తొలి ఇన్నింగ్స్లో 78 పరుగులకే ఆలౌట్ అవ్వడంతో.. ప్రస్తుతం రూట్ సేన 42 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. మొత్తానికి తొలి రోజులో బంతి, బ్యాటుతో సత్తాచాటిన ఇంగ్లండ్.. సొంతగడ్డపై తమకు ఎదురులేదని నిరూపించుకుంది. రెండో రోజు కూడా ఇంగ్లీష్ బ్యాట్స్మన్ అదరగొడితే.. కోహ్లీసేనకు కష్టాలు తప్పకపోవచ్చు. టీమిండియాకు ఫాలో ఆన్ గండం కూడా పొంచివుంది.
రాహుల్ డకౌట్:
మొదటగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ మొదటి ఇన్నింగ్స్లో 78 పరుగులకు ఆలౌటైంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ (0; 4 బంతుల్లో) డకౌటయ్యాడు. జేమ్స్ అండర్సన్ వేసిన తొలి ఓవర్ ఐదవ బంతికే కీపర్ జోస్ బట్లర్కు క్యాచ్ ఇచ్చి రాహుల్ వెనుదిరిగాడు. రాహుల్ అనంతరం క్రీజులోకి వచ్చిన టెస్ట్ స్పెసలిస్ట్ బ్యాట్స్మన్ చేతేశ్వర్ పుజారా (1; 9 బంతుల్లో) కూడా నిరాశపరిచాడు. అండర్సన్ వేసిన 4.1వ బంతికి అతడు కీపర్ బట్లర్కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో భారత్ నాలుగు పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
నిరాశపరిచిన పుజారా, కోహ్లీ:
చేతేశ్వర్ పుజారా అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రీజులోకి రాగా.. ఓపెనర్ రోహిత్ శర్మ వికెట్ కాపాడుకునేందుకు ప్రయత్నించాడు. జేమ్స్ అండర్సన్ నిప్పులు చెరగడంతో రోహిత్ తన సహజ శైలికి పూర్తి బిన్నంగా ఆడాడు. అనవసర షాట్లకు పోకుండా క్రీజులో కుదురుకోవడానికే చూశాడు. అయితే అండర్సన్ వేసిన ఇన్నింగ్స్ 10.5 ఓవర్కు కోహ్లీ ఔట్ అయ్యాడు. కీపర్ బట్లర్కి అతడు క్యాచ్ ఇచ్చాడు. దీంతో అండర్సన్ను ఎదుర్కోవడంలో కోహ్లీ మరోసారి విఫలమయ్యాడు. 7 పరుగులకే ఔట్ అవ్వడంతో భారత ఇన్నింగ్స్ గతి తప్పింది. విరాట్ అనంతరం అజింక్య రహానేతో కలిసి రోహిత్ నిదానంగా ఆడుతూ వికెట్లు పడకుండా అడ్డుకున్నాడు.
ఆరు బంతుల్లో 4 వికెట్లు:
అజింక్య రహానే, రోహిత్ శర్మ ఇద్దరూ కాసేపు సమయోచితంగా ఆడారు. రోహిత్ పూర్తిగా డిఫెన్స్కే పరిమితమయినా.. రహానే సింగిల్స్ తీస్తూ స్కోర్ వేగం పెంచే ప్రయత్నం చేశాడు. 18 పరుగులు చేసిన రహానే క్రీజులో కుదురుకున్నట్టుగానే కనిపించాడు. అంతలోనే ఓలి రాబిన్సన్కు చిక్కి వికెట్ సమర్పించుకున్నాడు. అనంతరం లంచ్ బ్రేక్కు వెళ్లింది భారత్. ఇక లంచ్ అనంతరం సామ్ కరన్, క్రెయిగ్ ఓవర్టన్ చెలరేగడంతో భారత్ ఆరు బంతుల్లో 4 వికెట్లు కోల్పోయింది. రిషబ్ పంత్ (2), రోహిత్ శర్మ (19), మొహ్మద్ షమీ (0), రవీంద్ర జడేజా (4)లు ఔట్ అయ్యారు. జస్ప్రీత్ బుమ్రా (0) కూడా గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఇషాంత్ శర్మ (8 నాటౌట్) స్కోర్ వేగం పెంచే ప్రయత్నం చేయగా.. మొహ్మద్ సిరాజ్ (3) ఔట్ అవ్వడంతో భారత ఇన్నింగ్స్కు తెరపడింది. అండర్సన్, ఓవర్టన్ మూడు వికెట్లు పడగొట్టగా.. రాబిన్సన్, కరన్ తలో రెండు వికెట్లు తీశారు.
అదరగొట్టిన ఇంగ్లండ్ ఓపెనర్లు:
భారత్ ఆలౌట్ అనంతరం తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన ఇంగ్లండ్కు ఓపెనర్లు రోరీ బర్న్స్, హసీబ్ హమీద్ మంచి ఆరంభం ఇచ్చారు. భారత బౌలర్లను సమర్ధవంతగా ఎదుర్కొంటూ పరుగులు చేశారు. ఇదే పిచ్పై భారత బ్యాట్స్మన్ తడబడగా.. ఇంగ్లండ్ ఓపెనర్లు మాత్రం అద్భుతంగా ఆడారు. ఇంగ్లీష్ ఓపెనర్లు సమయోచితంగా ఆడుతూ నెమ్మదిగా పరుగులు పెంచుకుంటూ పోయారు. ఈ క్రమంలోనే ఇద్దరూ హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నారు. అంతేకాదు 100కు పైగా భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ జోడిని విడదీసేందుకు కెప్టెన్ విరాట్ కోహ్లీ పదేపదే బౌలర్లను మార్చినా.. ప్రయోజనం లేకుండా పోయింది.