క్రికెట్ ప్రేమికులందరికీ జస్ప్రీత్ బుమ్రా ఓ ప్రమాదకర బౌలర్ అని మాత్రమే తెలుసు. అది ఏ ఫార్మాట్ అయినా సరే, వికెట్లు కావాలన్నా.. ప్రత్యర్థి స్కోరు నియంత్రణలోకి రావాలన్నా.. కెప్టెన్కు బుమ్రానే మొదట గుర్తొస్తాడు. అయితే బుల్లెట్ లాంటి యార్కర్లకు ప్రసిద్ధి అయిన బుమ్రా సిక్సర్లు కూడా బాదగలడు. అంతేగాక స్టైలిష్ షాట్లతో బౌండరీలు కూడా సాధించగలడు. కానీ అది కేవలం ఇంగ్లండ్ జట్టుపై మాత్రమే.
రాజ్కోట్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులో జస్ప్రీత్ బుమ్రా 28 బంతుల్లో 26 పరుగులు చేశాడు. మూడు బౌండరీలు, ఒక సిక్సర్ బాదాడు. టామ్ హర్ట్లీ బౌలింగ్లో లాంగాన్ మీదుగా బంతిని స్టాండ్స్కు తరలించాడు. ప్రధాన బ్యాటర్లు యశస్వీ జైస్వాల్, శుభ్మన్ గిల్, రజత్ పటిదార్ కంటే అధిక స్కోరు బుమ్రా సాధించడం విశేషం.

అయితే బుమ్రా తన బ్యాటింగ్ స్కిల్స్ను కేవలం ఇంగ్లండ్పైనే చూపిస్తున్నాడు. టెస్టుల్లో తన టాప్-5 వ్యక్తిగత స్కోర్లు ఇంగ్లండ్పైనే నమోదు కావడం విశేషం. 2021లో లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్పై అజేయంగా 34 పరుగులు చేశాడు. తర్వాత ఏడాది ఎడ్జ్బాస్టన్లో అజేయంగా 31 పరుగులు సాధించాడు. ఆ తర్వాత తన అత్యధిక స్కోర్లు 28 పరుగులు (ట్రెంట్ బ్రిడ్జ్, 2021); 28 రన్స్ (రాజ్కోట్, 2024); 24 పరుగులు (ఓవన్, 2021) కూడా ఇంగ్లిష్ జట్టుపైనే సాధించాడు.
ఈ నేపథ్యంలో బుమ్రా ఇంగ్లండ్పై పగబట్టాడని నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. బ్యాటింగ్లో సాధించిన తన టాప్-5 వ్యక్తిగత స్కోర్లను చూస్తే ప్రూఫ్స్ దొరుకుతాయని అంటున్నారు. కాగా, మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 445 పరుగులకు ఆలౌటైంది. రవీంద్ర జడేజా (112; 225 బంతుల్లో), రోహిత్ శర్మ(131; 196 బంతుల్లో) శతకాలతో కదంతొక్కారు. సర్ఫరాజ్ ఖాన్ (62; 66 బంతుల్లో) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
ధ్రువ్ జురెల్(46; 104 బంతుల్లో), రవిచంద్రన్ అశ్విన్(37; 89 బంతుల్లో ) ఆకట్టుకున్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ నాలుగు వికెట్లు, రెహ్మన్ అహ్మద్ రెండు, జేమ్స్ అండర్సన్, టామ్ హార్ట్లీ, జో రూట్ తలో వికెట్ తీశారు. 326/5 ఓవర్నైట్ స్కోర్తో భారత్ రెండో రోజు ఆటను ప్రారంభించిన సంగతి తెలిసిందే.