శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్లో భారీ స్కోరులు చేయలేకపోయినా సూపర్ ఫీల్డింగ్తో అదరగొడుతున్నాడు. రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ కీలక బ్యాటర్ బెన్ స్టోక్స్ను 'బుల్లెట్ త్రో' తో రనౌట్ చేశాడు. చిరుతలా కదిలి మెరుపు వేగంతో బంతిని వికెట్లకు సంధించాడు. అసలేం జరిగిదంటే.. అశ్విన్ బౌలింగ్లో బెన్ ఫోక్స్ సింగిల్కు ప్రయత్నించాడు. ఫీల్డర్ లేని ప్లేస్లోనే షాట్ ఆడి పరుగు కోసం ట్రై చేశాడు.
నాన్స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్న స్టోక్స్ కూడా పరుగు సాధించవచ్చని దానికి నిరాకరించలేదు. కానీ మిడ్ వికెట్లో ఫీల్డింగ్ చేస్తున్న శ్రేయస్ అయ్యర్ మెరుపు వేగంతో వచ్చాడు. ఒంటి చేత్తో బంతి అందుకుని వికెట్లు గురి చూసి వదిలాడు. నేరుగా బంతి వికెట్లకు తగలడంతో స్టోక్స్ నిరాశగా వెనుదిరిగాడు. స్టోక్స్ వికెట్ మ్యాచ్లో కీలకమైన మలుపుగా మారింది. ఎందుకంటే గతంలో ఒంటి చేత్తో స్టోక్స్ అద్భుత ఇన్నింగ్స్ ఆడి గెలిపించిన విషయం తెలిసిందే.

మరోవైపు స్టోక్స్ను రనౌట్ చేసిన అనంతరం శ్రేయస్ అయ్యర్ రివెంజ్ తీర్చుకుంటూ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. భారత్ రెండో ఇన్నింగ్స్లో శ్రేయస్ ఆడిన షాట్ను స్టోక్స్ గొప్పగా డైవ్ చేస్తూ క్యాచ్ను అందుకున్న విషయం తెలిసిందే. క్యాచ్ పట్టిన అనంతరం స్టోక్స్ భారత అభిమానులకు వేలు చూపిస్తూ సంబరాలు చేసుకున్నాడు. ఇప్పుడు దానికి ప్రతీకారంగా శ్రేయస్ కూడా అదే తరహాలో సెలబ్రేషన్స్ చేశాడు. కాగా, శ్రేయస్ అయ్యర్ తొలి ఇన్నింగ్స్లో 27 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 29 పరుగులు తీశాడు.
ప్రస్తుతం ఇంగ్లండ్ ఏడు వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసింది. టామ్ హర్ట్లీ (18; 23 బంతుల్లో), బెన్ ఫోక్స్ (27; 52 బంతుల్లో) క్రీజులో ఉన్నారు. విజయానికి ఇంగ్లండ్ 145 పరుగుల దూరంలో, భారత్ మూడు వికెట్ల దూరంలో ఉన్నాయి. 399 పరుగుల లక్ష్యంతో ఇంగ్లండ్ ఓవర్నైట్ స్కోరు 67/1తో ఇవాళ ఆటను ప్రారంభించిన సంగతి తెలిసిందే.