రాంచీ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా పోరాడుతోంది. రెండో రోజు ఆట ముగిసేసరికి తొలి ఇన్నింగ్స్లో 73 ఓవర్లలో భారత్ ఏడు వికెట్లకు 219 పరుగులు చేసింది. ప్రత్యర్థి కంటే 134 పరుగుల వెనుకంజలో ఉంది. క్రీజులో ధ్రువ్ జురెల్ (30*; 58 బంతుల్లో), కుల్దీప్ యాదవ్ (17*; 72 బంతుల్లో) ఉన్నారు.
స్వదేశంలో ఆడుతున్న టీమిండియా స్పిన్ ఉచ్చులో చిక్కడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ధ్రువ్ జురెల్, కుల్దీప్ క్రీజులో ఉన్నప్పటికీ ఆదివారం తొలి సెషన్లో ఇంగ్లండ్ బౌలర్లు సత్తాచాటే అవకాశం ఉంది. ఇంగ్లండ్కు ఆధిక్యం దక్కకుండా ఉండాలంటే టీమిండియా టెయిలెండర్లు అదరగొట్టాల్సి ఉంది. అయితే భారత్ 177 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోవడానికి కారణం 20 ఏళ్ల కుర్రాడు షోయబ్ బషీర్.

ఇంగ్లండ్ యువ స్పిన్నర్ బషీర్ శనివారం ఆటలో 32 ఓవర్లు వేశాడు. నాలుగు ఓవర్లు మెయిడిన్ చేసి 84 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టారు. కీలక బ్యాటర్లు యశస్వీ జైస్వాల్ (71; 117 బంతుల్లో), శుభ్మన్ గిల్ (38; 65 బంతుల్లో), రజత్ పటిదార్ (17; 42 బంతుల్లో), రవీంద్ర జడేజా (12; 12 బంతుల్లో)ను ఔట్ చేశాడు.
అయితే షోయబ్ బషీర్ తన స్పెల్లో వరుసగా 31 ఓవర్లు సంధించాడు. భారత్ ఇన్నింగ్స్లో తొమ్మిదో ఓవర్లో బంతిని అందుకున్న బషీర్.. 69వ ఓవర్ వరకు క్రమం తప్పకుండా బౌలింగ్ చేశాడు. ఆ తర్వాత 70, 71 ఓవర్ వేయకుండా 72 ఓవర్ వేశాడు. మధ్యలో డ్రింక్స్ బ్రేక్, సెషన్ విరామం ఉన్నప్పటికీ వరుసగా అన్ని ఓవర్లు వేయడమంటే అసాధరణ విషయం.
టీమిండియా బ్యాటర్లను షోయబ్ బషీర్ ఇబ్బంది పెడుతున్నాడని గమనించిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. అతడితో అవిరామంగా బౌలింగ్ చేయించాడు. దీంతో స్టోక్స్ నెట్టింట్లో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. జట్టు ప్రయోజనాలతో పాటు ఆటగాళ్ల పనిభారం గురించి ఆలోచించాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బషీర్ 20 ఏళ్ల కుర్రాడు అని, అతడిని మనిషిలా చూడాలని, అతడు మెషిన్ కాదని.. బెన్ స్టోక్స్పై విరుచుకుపడుతున్నారు. కాగా, షోయబ్ బషీర్ తన కెరీర్లో ఇది రెండో టెస్టు మాత్రమే. వైజాగ్ వేదికగా జరిగిన టెస్టులో బషీర్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు.