ఇంగ్లండ్తో వైజాగ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆధిపత్యం చెలాయిస్తోంది. శుభ్మన్ గిల్ (104; 147 బంతుల్లో) సెంచరీతో చెలరేగడంతో మూడో రోజు ఆటలోనూ భారత్ టాప్లో నిలిచింది. ఓవర్నైట్ స్కోరు 28/0తో ఆదివారం ఆటను ఆరంభించిన టీమిండియా 255 పరుగులకు ఆలౌటైంది. అక్షర్ పటేల్ (45; 84 బంతుల్లో) సెకండ్ టాప్ స్కోరర్. అనంతరం 399 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఇవాళ ఆట ముగిసేసరికి వికెట్ కోల్పోయి 67 పరుగులు చేసింది. క్రీజులో జాక్ క్రాలే (29*; 50 బంతుల్లో), రెహాన్ అహ్మద్ (9*; 8 బంతుల్లో) ఉన్నారు. బెన్ డకెట్ (28; 27 బంతుల్లో)ను అశ్విన్ ఔట్ చేశాడు.
అయితే ఫామ్ కోల్పోయి గత కొన్నాళ్లుగా విమర్శలు ఎదుర్కొంటున్న శుభ్మన్ గిల్ ఎట్టకేలకు సెంచరీ సాధించాడు. జట్టులో తన స్థానంపై సందేహాలు వస్తున్న ఈ తరుణంలో ఈ ఇన్నింగ్స్ తనకి ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని గిల్ పేర్కొన్నాడు. నాలుగు పరుగుల వద్ద తాను పెవిలియన్కు చేరేవాడినని, కానీ శ్రేయస్ అయ్యర్ రివ్యూకి వెళ్లమని చెప్పడంతో సమీక్షకు వెళ్లానని గిల్ తెలిపాడు. తాను ఎదుర్కొన్న ఏడో బంతికే గిల్ ఔట్ అని అంపైర్ ప్రకటించిన విషయం తెలిసిందే. టామ్ హర్ట్లీ వేసిన బంతికి గిల్ ఎల్బీడబ్ల్యూగా అంపైర్ తేల్చాడు. కానీ రివ్యూకి వెళ్లి గిల్ బతికిపోయాడు. అనంతరం సాధికారికంగా ఆడుతూ శతకాన్ని బాదాడు.

''ఎంతో సంతోషంగా ఉంది. అయితే బ్యాట్కు ఎడ్జ్ తీసుకుందని నేను తొలుత భావించలేదు. కానీ శ్రేయస్ అయ్యర్ రివ్యూకి వెళ్లమని చెప్పాడు. అంపైర్ కాల్ అయినా ఫర్వాలేదు సమీక్ష కోరమన్నాడు. తర్వాత నాటౌట్ అని తేలింది. ఇక నా ఔట్ విషయానికొస్తే.. పాయింట్ ఫీల్డర్ను చూసి ఆ షాట్ ఆడాను. కానీ కనెక్ట్ అవ్వలేదు. టీ విరామానికి అయిదు ఓవర్లు ముందు ఔటయ్యాను'' అని గిల్ అన్నాడు. రివర్స్ స్వీప్కు ట్రై చేసి గిల్ తన వికెట్ను చేజార్చుకున్నాడు.
''బ్యాటింగ్ చేయడానికి ఈ వికెట్ బాగుంది. అయితే స్వేచ్ఛగా ఆడేంతలా సులువైన వికెట్ కూడా ఇది కాదు. మన ప్రతిభకు తగ్గట్లుగా ఆడాలి. బంతి టర్న్ అవుతుంది. రేపు సరైన ప్రదేశాల్లో మా బౌలర్లు సంధించి మంచి ఫలితాన్ని రాబడతానని భావిస్తున్నాను. మార్నింగ్ సెషన్ చాలా కీలకంగా ఉంటుందనుకుంటున్నా. ఇవాళ ఉదయం ఫాస్ట్ బౌలర్లకు అనుకూలించింది'' అని గిల్ పేర్కొన్నాడు.
ఓవర్నైట్ స్కోరు 28/0తో మూడో రోజు ఆటను ఆరంభించిన టీమిండియాకు ఆదిలోనే షాక్ ఎదురైంది. కెప్టెన్ రోహిత్ శర్మ (13; 21 బంతుల్లో), యశస్వీ జైస్వాల్ (17; 27 బంతుల్లో)ను ఇంగ్లండ్ పేసర్ అండర్సన్ పెవిలియన్కు చేర్చాడు. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన శ్రేయస్ అయ్యర్ (29; 52 బంతుల్లో)తో కలిసి గిల్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. వీరిద్దరు మూడో వికెట్కు 81 పరుగులు జోడించి టీమిండియాను పటిష్టస్థితిలో నిలబెట్టారు. ఆ తర్వాత అక్షర్ పటేల్ (45; 84 బంతుల్లో)తో కలిసి గిల్ మరోసారి కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయిదో వికెట్ 89 పరుగులు జోడించాడు.