భారత్లో ఇంగ్లండ్ బజ్బాల్ పనిచేయదని, ఇక్కడ పరిస్థితులు సహకరించవని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. ఇంగ్లండ్తో జరుగుతున్న అయిదు టెస్టుల సిరీస్లో భారత్ 2-1తో ఆధిక్యంలో నిలిచిన సంగతి తెలిసిందే. రాజ్కోట్ వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమిండియా 434 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. భారత టెస్టు చరిత్రలో పరుగుల పరంగా ఇదే రికార్డు విజయం.
కాగా, ఫిబ్రవరి 23 నుంచి రాంచీ వేదికగా నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. డబుల్ సెంచరీ హీరో యశస్వీ జైస్వాల్, అరంగేట్రంలోనే అదరగొట్టిన సర్ఫరాజ్ ఖాన్ను కొనియాడాడు. స్టార్ ఆటగాళ్లు లేకుండానే టీమిండియా సత్తాచాటుతుందని అన్నాడు.

''యశస్వీ జైస్వాల్ మంచి ఆటగాడు. క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో సత్తాచాటే సామర్థ్యం అతడికి ఉంది. సర్ఫరాజ్ ఖాన్ గొప్పగా ప్రారంభించాడు. ఇక అతడు విదేశాల్లో కూడా పరుగులు చేస్తూ సత్తాచాటాలి. వర్థమాన క్రికెటర్లకు సర్ఫరాజ్ ఓ మంచి ఉదాహరణ. నిలకడగా పరుగులు సాధిస్తే అవకాశాలు పొందవచ్చని నిరూపించాడు''
''ఇక బజ్బాల్ విషయానికొస్తే అది మంచిదే. కానీ భారత్లో బజ్బాల్తో ఇంగ్లండ్ విజయవంతం కాలేదు. ఇక్కడ పరిస్థితులు కఠినంగా ఉంటాయి. భారత్ సిరీస్ ఓడిపోతే ఇక్కడ పెద్ద ఆశ్చర్యం. విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ లేకుండా టీమిండియా ఆడుతోంది. యువ ప్లేయర్లు జట్టులో ఉన్నారు. అయినప్పటికీ ఇంగ్లండ్ కష్టంగా పోరాడుతోంది. భారత్ జట్టు ఎంతో విశ్వాసంతో కనిపిస్తోంది. టెస్టు మధ్యలో అశ్విన్కు అనుమతి ఇచ్చారు. అయినా అదరగొట్టారు. ఈ జట్టు ఎంతో ఉత్సాహంగా కనిపిస్తోంది'' అని గంగూలీ అన్నాడు.
వ్యక్తిగత కారణాలతో మూడో టెస్టులో మూడో రోజు అశ్విన్ ఆటకు దూరమైన విషయం తెలిసిందే. అశ్విన్ లేనప్పటికీ మిగిలిన బౌలర్లు గొప్పగా ఆడారు. నాలుగో రోజు ఆటలో రెండో సెషన్కు అశ్విన్ తిరిగి అందుబాటులోకి వచ్చాడు. మరోవైపు కోహ్లి సిరీస్ మొత్తానికి, కేఎల్ రాహుల్ రెండు, మూడు, నాలుగు టెస్టులకు దూరమైన విషయం తెలిసిందే. ఫిట్నెస్ సాధించి ఆఖరి టెస్టుకు అందుబాటులో ఉండాలని రాహుల్ ప్రయత్నిస్తున్నాడు.