టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ను దిగ్గజ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కొనియాడాడు. రాజ్కోట్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులో జైస్వాల్ సెంచరీ సాధించిన విషయం తెలిసిందే. జైస్వాల్కు వరుసగా ఇది రెండో శతకం. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో హాఫ్ సెంచరీ సాధించిన అతడు వైజాగ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో డబుల్ సెంచరీ బాదాడు.
అయితే మూడో టెస్టులో జైస్వాల్ తొలుత నిదానంగా ఆడాడు. ఆచితూచి బంతులను ఎదుర్కొంటూ పరుగులు తీశాడు. ఓ దశలో 73 బంతుల్లో జైస్వాల్ చేసిన పరుగులు 35 మాత్రమే. ఆ తర్వాత పూనకం వచ్చినట్లుగా జైస్వాల్ చెలరేగిపోయాడు. అండర్సన్ బౌలింగ్లో 6, 4, 4 బాదాడు. ఆ తర్వాత టామ్ హర్ట్లీ వేసిన ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు బాది 78 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. స్వీప్, రివర్స్ స్వీప్, లాఫ్టెడ్ షాట్లతో జైస్వాల్ బౌండరీల మోత మోగిస్తూ 122 బంతుల్లో సెంచరీ అందుకున్నాడు.

ఈ నేపథ్యంలో జైస్వాల్ను ప్రశంసిస్తూ సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. ''జైస్వాల్ బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు సాధించాడు. స్పిన్నర్లను ఎలా బాదాలో అలానే చితక్కొట్టాడు. ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇక బౌలింగ్ విషయానికొస్తే సిరాజ్, కుల్దీప్ గొప్పగా ఆడారు. జట్టులో పది మంది మాత్రమే ఉన్నప్పటికీ అద్భుత పోరాటపటిమ చూపారు'' అని సెహ్వాగ్ ట్వీట్లు చేశాడు. వ్యక్తిగత కారణాలతో రవిచంద్రన్ అశ్విన్ మూడో టెస్టుకు దూరమవ్వడంతో నలుగురు బౌలర్లు మాత్రమే బరిలోకి దిగిన విషయం తెలిసిందే.
కాగా, సెంచరీ బాదిన జైస్వాల్ ఓ రికార్డులో సెహ్వాగ్ సరసన నిలిచాడు. టెస్టుల్లో వేగంగా మూడు సెంచరీలు సాధించిన ఏడో ఆటగాడిగా చరిత్రకెక్కాడు. 13 ఇన్నింగ్స్లో జైస్వాల్ మూడు శతకాలు బాదాడు. ఈ జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్, సంజయ్ మంజ్రేకర్తో పాటు జైస్వాల్ ఉన్నాడు.గణాంకాల్లో సెహ్వాగ్ కంటే మెరుగైన సగటును జైస్వాల్ కలిగి ఉన్నాడు. సెహ్వాగ్ 13 ఇన్నింగ్స్ల్లో 53 సగటుతో 66 స్ట్రైక్ రేటుతో పరుగులు సాధిస్తే జైస్వాల్ 62 సగటుతో 65 స్ట్రైక్ రేటుతో రన్స్ చేశాడు. కాగా, రాజ్కోట్ టెస్టులో 133 బంతుల్లో 104 పరుగులు సాధించిన జైస్వాల్ రిటైర్ హర్ట్గా మైదానాన్ని వీడాడు. వెన్నునొప్పి కారణంతో వెనుదిరిగాడు.