డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ను సులువైన ప్రణాళికతో చిత్తుచేశామని టీమిండియా యువ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ తెలిపాడు. గయానా వేదికగా ఇంగ్లండ్తో జరిగిన సెమీఫైనల్లో భారత్ 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్కు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన అక్షర్ పటేల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.
ఆరు బంతులు ఎదుర్కొన్న అక్షర్ అజేయంగా 10 పరుగులు చేశాడు. అనంతరం పవర్ప్లేలో బంతిని అందుకున్న అక్షర్ ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. తన మొదటి మూడో ఓవర్లలో తొలి బంతికి కీలక బ్యాటర్లను పెవిలియన్కు చేర్చి ఇంగ్లిష్ జట్టును కోలుకోలేని దెబ్బతీశాడు. ఇంగ్లండ్ టాప్-4 బ్యాటర్లలో ముగ్గురిని అక్షరే ఔట్ చేశాడు. డేంజర్ బ్యాటర్ బట్లర్ (23; 15 బంతుల్లో, 4 ఫోర్లు), బంతికి బెయిర్స్టో (డకౌట్), మొయిన్ అలీ (8; 10 బంతుల్లో) పెవిలియన్కు చేర్చాడు.

కాగా, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న అనంతరం అక్షర్ పటేల్ మాట్లాడాడు. స్లో వికెట్పై స్లోగా బౌలింగ్ వేయడమే తన ప్రణాళిక అని, అది గొప్పగా ఫలించిందని అన్నాడు. ''గతంలో కూడా పవర్ప్లేలో బౌలింగ్ వేశాను. అదే విధంగా ఈ మ్యాచ్లో కూడా బౌలింగ్ వేయాలనుకున్నా. వికెట్ కాస్త కఠినంగా, స్లోగా ఉంది. కాబట్టి సరైన ప్రదేశాల్లో, నెమ్మదిగా బంతులు సంధించాలనుకున్నా. ఆ ప్రణాళిక పనిచేసింది. నేను వేగంగా బౌలింగ్ చేసి ఉంటే ప్రత్యర్థి బ్యాటర్లకు అవకాశం దక్కేది''
''ఇక్కడ పిచ్ కఠినంగా ఉందని మా బ్యాటర్లు ముందే చెప్పారు. 160 స్కోరు సరిపోతుందని అన్నారు. మా ఇన్నింగ్స్లో రోహిత్-సూర్య భాగస్వామ్యం అద్భుతంగా సాగింది. స్ట్రైక్ను రొటేట్ చేస్తూ సందర్భాన్ని బట్టి బౌండరీలు సాధించారు. ఇక ఇప్పుడు ఫైనల్ గురించి ఆలోచించట్లేదు. ఈ విజయాన్ని ప్రస్తుతం ఆస్వాదిస్తున్నాం'' అని అక్షర్ పేటల్ పేర్కొన్నాడు. కాగా, మొదట భారత్ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 171 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (57; 39 బంతుల్లో, 6 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (47; 36 బంతుల్లో, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తాచాటారు.
అనంతరం ఛేదనలో ఇంగ్లండ్ 16.4 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. హ్యారీ బ్రూక్ (25; 19 బంతుల్లో, 3 ఫోర్లు) టాప్ స్కోరర్. కుల్దీప్ యాదవ్ (3/19), అక్షర్ పటేల్ (3/23) చెరో మూడు వికెట్లు, బుమ్రా (2/12) రెండు వికెట్లతో విజృంభించారు.