ధర్మశాల వేదికగా భారత్ -ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఆఖరి టెస్టులో శుభ్మన్ గిల్ - జేమ్స్ అండర్సన్ మధ్య పోటీ ఆసక్తికరంగా సాగిందని మాజీ క్రికెటర్ జహీర్ఖాన్ అన్నాడు. వీరిద్దరి మధ్య ఫైట్ ఇంతటితో ఆగదని, ఇంగ్లండ్ దేశం వరకు కొనసాగుతుందని అభిప్రాయపడ్డాడు. రెండో రోజు ఆటలో గిల్, అండర్సన్ మధ్య హీట్ మూమెంట్ ఏర్పడింది.
అండర్సన్ విసిరిన సవాలైన బంతులను గిల్ గొప్పగా ఎదుర్కొన్నాడు. ప్రతిదాడికి దిగుతూ బౌండరీలు సాధించాడు. క్రీజును వదిలి అండర్సన్ తల మీదుగా సిక్సర్ బాదడం మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. సిరీస్లో కోహ్లి-అండర్సన్ పోటీని మిస్ అయిన అభిమానులకు.. శుక్రవారం గిల్-అండర్సన్ మధ్య సాగిన హీట్ మూమెంట్ కాస్త సంతృప్తి ఇచ్చి ఉంటుంది.

41 ఏళ్ల అండర్సన్ కంట్రోల్ తప్పి గిల్తో మాటల యుద్ధానికి దిగాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే సెంచరీ సాధించిన గిల్(110; 150 బంతుల్లో)ను అండర్సన్ క్లీన్ బౌల్డ్ చేయడంతో వీరిద్దరి ఫైట్ రసవత్తరంగా మారింది. దీనిపై టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ మాట్లాడాడు. ''గిల్ తన సహజసిద్ధమైన ఆటను తిరిగి ప్రదర్శించడం ఎంతో బాగుంది. తొలి టెస్టులో గిల్ రక్షణాత్మక ధోరణీతో బ్యాటింగ్ చేశాడు. కానీ ఇప్పుడు నమ్మకంతో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు''
''గిల్ నుంచి ఈ ప్రదర్శన రాబట్టుకోవడంలో కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ పాత్ర కీలకం. అండర్సన్ బౌలింగ్లో గిల్ సిక్సర్ సాధించిన షాట్ అంత ఈజీ కాదు. క్రీజు నుంచి బయటకు వచ్చి లాఫ్టెడ్ షాట్ ఆడాడు. ఆ షాట్ను గిల్ సరిగ్గా ఆడకపోతే విమర్శల పాలయ్యేవాడు. కానీ గొప్పగా ఆ స్ట్రోక్ ఆడాడు. తన ఆటపై ఆత్మవిశ్వాసంతో ఉన్నాడని అర్థమవుతోంది. అయితే ధర్మశాలలో బ్యాటింగ్కు కాస్త అనుకూలంగా ఉంది. కాబట్టి 'ఇంగ్లండ్కు రా.. నేనేంటో చూపిస్తా' అని గిల్ గురించి అండర్సన్ మదిలో ఇలా ఆలోచించి ఉండవచ్చు'' అని జహీర్ ఖాన్ పేర్కొన్నాడు.