టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. రాజ్కోట్ వేదికగా రేపటి నుంచి ఇంగ్లండ్తో మూడో టెస్టు ఆడనుంది. తొలి టెస్టులో ఓటమి అనంతరం అద్భుతంగా పుంజుకుని రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే గెలిచినప్పటికీ భారత జట్టులో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బ్యాటర్ల కంటే బౌలర్లపైనే జట్టు ఎక్కువగా ఆధారపడుతోంది.
సీనియర్ ఆటగాళ్లు జట్టులో లేకపోవడం, యువ బ్యాటర్లు విఫలమవ్వడం భారత్కు ప్రతికూలంగా మారుతోంది. విరాట్ కోహ్లి వ్యక్తిగత కారణాలతో, కేఎల్ రాహుల్ గాయంతో జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. అయితే ఈ పరిస్థితుల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తనదైన శైలిలో బ్యాటింగ్ చేస్తూ జట్టును ఆదుకోవాలని మాజీ క్రికెటర్ ఆర్పీ సింగ్ సూచించాడు.

'' రోహిత్ శర్మ ఓవర్ థింకింగ్ చేస్తున్నాడు. భారీ ఇన్నింగ్స్ ఆడాలని, కనీసం రెండు, మూడు కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాలని ఆలోచిస్తున్నాడు. ప్రధాన ఆటగాళ్ల గైర్హాజరీలో ఇన్నింగ్స్ చక్కదిద్దాలని ప్రయత్నిస్తున్నాడు. అయితే ఈ ప్రయత్నంలో రోహిత్ అతి జాగ్రత్త పడుతున్నాడు. కానీ రోహిత్ అలాంటి ఆటగాడు కాదు. అతడి శైలి భిన్నమైనది. స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసే స్టైల్ రోహిత్ది. అది ఇప్పుడు మిస్ అవుతోంది. మునపటిలా షాట్లు ఆడాలి. అతి జాగ్రత్తగా ఉంటే బ్యాటర్గా, వ్యక్తిగా అతడికి మంచిది కాదు'' అని ఆర్పీ సింగ్ అన్నాడు.
రోహిత్ శర్మ సుదీర్ఘ ఫార్మాట్లో గత నాలుగు మ్యాచ్ల్లో సత్తాచాటలేకపోయాడు. సౌతాఫ్రికా పర్యటనలో విఫలమయ్యాడు. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో అయిదు పరుగులు, రెండో ఇన్నింగ్స్లో డకౌట్ అయ్యాడు. రెండో టెస్టులో 39, 16* పరుగులు మాత్రమే సాధించాడు. ఇక స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగే టెస్టు సిరీస్లోనూ రోహిత్ పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. ఉప్పల్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో 24, 39 పరుగులు సాధించాడు. వైజాగ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో 14, 13 పరుగులే చేశాడు.