రాంచీ వేదికగా భారత్తో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి రోజు ఆటలో ఇంగ్లండ్ మెరుగైన స్థితిలోనే నిలిచింది. శుక్రవారం ఆట ముగిసేసరికి 90 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 302 పరుగులు చేసింది. ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ (106*; 226 బంతుల్లో) అజేయ సెంచరీతో సత్తాచాటాడు. అతడికి తోడుగా క్రీజులో ఒలీ రాబిన్సన్ (31*; 60 బంతుల్లో) ఉన్నాడు.
అయితే 60 ఓవర్లలోపే టీమిండియా తమ రివ్యూలన్నీ కోల్పోయింది. సహచర ఆటగాళ్ల ఒత్తిడితో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సమీక్ష కోరడంలో గందరగోళానికి గురయ్యాడు. 60వ ఓవర్లో జడేజా వేసిన బంతి బెన్ ఫోక్స్ (47; 126 బంతుల్లో) ప్యాడ్లకు తగిలింది. ఎల్బీడబ్ల్యూగా టీమిండియా అపీల్ చేసింది. కానీ అంపైర్ నాటౌట్గా ప్రకటించాడు. దీంతో రోహిత్ రివ్యూ అడగాలా వద్దా అనే ఆలోచనలో పడ్డాడు.

మరోవైపు జడేజా రివ్యూ తీసుకోమని ఒత్తిడి తీసుకువచ్చాడు. అదే సమయంలో ఇతర ఆటగాళ్లు కూడా తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్తో మాట్లాడిన తర్వాత రోహిత్ సమీక్షకు వెళ్లాడు. కానీ భారత్కు ప్రతికూల ఫలితం వచ్చింది. దీంతో టీమిండియా తమ మూడు రివ్యూలను కోల్పోయింది.
ఆ తర్వాత ఆఖరి సెషన్ చివర్లో ఒలీ రాబిన్సన్ను జడేజా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. కానీ అంపైర్ కుమార ధర్మసేన నాటౌట్ అని వెల్లడించాడు. రివ్యూకి వెళ్లాలనుకున్నా భారత్ అవకాశం లేకపోయింది. ఇది మ్యాచ్పై ప్రభావం చూపే అవకాశం ఉంది. రాబిన్సన్ బౌలర్ అయినప్పటికీ 60 బంతుల్లో అజేయంగా 31 పరుగులు చేశాడు. నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు.
ఈ నేపథ్యంలో రివ్యూలు తీసుకోవడంలో తడబాటుకు గురైన టీమిండియాపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ''ఆటగాళ్ల సిఫార్సులను తీసుకోవడం అన్నిసార్లు సమంజసం కాదు. తొలుత రివ్యూ కోసం రోహిత్ ఆసక్తి చూపలేదు. కానీ అతడిని బలవంతంగా ఒప్పించారు. టర్న్ కొంచెమే అయినట్లుగా కనిపిస్తోంది. బంతిని ఎదుర్కోవడానికి బ్యాటర్ ఇబ్బంది పడ్డాడు. కానీ బ్యాక్ ప్యాడ్కు కూడా తగల్లేదు. ఫ్రంట్ ప్యాడ్కు తాకింది. ఇప్పుడు భారత్ అన్ని రివ్యూలు కోల్పోయింది''
''వికెట్ సాధించాలని బౌలర్లు ఉత్సుకతతో ఉంటారు.దాన్ని అర్థం చేసుకోగలను. కానీ బంతి బ్యాటర్ ప్యాడ్లకు ఎక్కడ తగిలిందో గమనించాలి. అది సత్ఫలితాన్నిస్తుందో లేదో అనే కనీస అవగాహాన్ని కలిగి ఉండాలి. అంపైర్ కాల్తో అయినా లాభపడతామా అని ఆలోచించాలి. రివ్యూలని కోల్పోకుండా జాగ్రత్త వహించాలి'' అని సునీల్ గవాస్కర్ అన్నాడు. కాగా, రాబిన్సన్తో కలిసి రూట్ ఎనిమిదో వికెట్కు అభేద్యమైన అర్ధశతక (57) భాగస్వామ్యాన్ని నమోదుచేశాడు. భారత్ బౌలర్లలో అకాశ్ దీప్ మూడు వికెట్లు, సిరాజ్ రెండు, జడేజా, అశ్విన్ చెరో వికెట్ తీశారు.