వెనక్కి తగ్గిన రాహుల్
భారత్ తొలి ఇన్నింగ్స్ 44వ ఓవర్ వేసిన ఓలీ రాబిన్సన్ బౌలింగ్లో ఓపెనర్ కేఎల్ రాహుల్ (57: 151 బంతుల్లో 9x4) బంతిని పాయింట్ దిశగా ఫుష్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ ఆశించిన విధంగా రాహుల్ బంతిని కనెక్ట్ చేయలేకపోయాడు. దాంతో సిల్లీ పాయింట్లోనే బంతి ఆగిపోయింది. ఇదే సమయంలో సింగిల్ కోసం నాన్స్ట్రైక్ ఎండ్లోని అజింక్య రహానేని రాహుల్ పిలిచాడు. వెంటనే స్పందించిన జింక్స్ పరుగెత్తుకుంటూ పిచ్ మధ్యలోకి వచ్చేశాడు. ఫీల్డర్ జానీ బెయిర్స్టో వేగంగా బంతి అందుకుని అందుకోవడంతో.. రాహుల్ వెనక్కి తగ్గాడు. రెండడుగులు ముందుకేసి రాహుల్ క్రీజు వద్దే ఆగిపోయాడు. రహానేని వెనక్కి వెళ్లిపోవాల్సిందిగా సూచించాడు.

రహానే రనౌట్
సింగిల్కి పిలిచిన కేఎల్ రాహుల్ చివరి నిమిషంలో వెనక్కి తగ్గడంతో.. అప్పటికే పిచ్ మధ్యలోకి వచ్చేసిన అజింక్య రహానే మళ్లీ నాన్స్ట్రైక్ ఎండ్లోని క్రీజులోకి వెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే అప్పటికే ఆలస్యమైపోయింది. వేగంగా బంతిని అందుకున్న జానీ బెయిర్స్టో.. బంతిని డైరెక్ట్గా నాన్స్ట్రైక్ ఎండ్లోని వికెట్లపైకి విసిరాడు.
దాంతోక్రీజుకి చాలా దూరంలో రహానే ఉండగానే బెయిల్స్ ఎగిరిపోయాయి. దీంతో జింక్స్ రనౌట్ అయ్యాడు. రహానే రనౌటైన తీరుపై డ్రెస్సింగ్ రూములోని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.

ఏంటి రహానే ఇలా చేశావు
అజింక్య రహానే రనౌట్పై నెటిజన్లు వినూత్న రీతిలో స్పందించారు. 'ఏంటి రహానే ఇలా చేశావు.. అంత తొందరెందుకు నీకు', 'రాహుల్ సిగ్నల్ చూస్తే బాగుండు.. అనవసర తప్పిదంతో రనౌట్ అయ్యావు' అంటూ కామెంట్ చేశారు.ఇదే సమయంలో మ్యాచ్ కామెంటేటర్లు కూడా రహానేదే తప్పిదం అని పేర్కొన్నారు. 'స్ట్రైక్లోని బ్యాట్స్మెన్ బంతిని హిట్ చేసిన తర్వాత పరుగు కోసం క్రీజు వెలుపలికి వచ్చి మళ్లీ వెనక్కి తగ్గడం మామూలే.
బంతి గమనాన్ని వేగంగా పసిగట్టలేకపోవడం ఓ కారణంగా చెప్పొచ్చు. కానీ నాన్స్ట్రైక్ ఎండ్లోని బ్యాట్స్మెన్ ఎక్కువ బాధ్యతగా, హుషారుగా ఉండాలి. స్ట్రైక్లోని బ్యాట్స్మెన్ని అతనే అలెర్ట్ చేయాలి. కానీ రహానే ఇక్కడ కాస్త తొందరపడినట్లు కనిపించింది' అని అన్నారు.

శుభారంభం లభించినా
వరుణుడి దోబూచులాట మధ్య సాగిన తొలి టెస్టులో టీమిండియాకు శుభారంభం లభించినా.. ఇంగ్లండ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ (2/15) విజృంభించడంతో భారత టాపార్డర్ తడబడింది. ఫలితంగా రెండో రోజు వర్షం కారణంగా ఆట నిలిచిపోయే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్లకు 125 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (57 నాటౌట్) హాఫ్ సెంచరీ చేయగా.. రోహిత్ శర్మ (36) ఫర్వాలేదనిపించాడు.
విరాట్ కోహ్లీ (0), చేతేశ్వర్ పుజారా (4), అజింక్య రహానే (5) ఘోరంగా విఫలమయ్యారు. వర్షం కారణంగా గురువారం 33 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం అయింది. చేతిలో ఆరు వికెట్లు ఉన్న కోహ్లీసేన.. ఇంగ్లండ్ స్కోరుకు ఇంకా 58 పరుగులు వెనుకబడి ఉంది. ప్రస్తుతం రాహుల్తో పాటు రిషబ్ పంత్ (7) క్రీజులో ఉన్నాడు.


Click it and Unblock the Notifications












