ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ ఓటమి అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ను తప్పించాలన్న డిమాండ్లు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే గంభీర్.. ప్రధాన కోచ్ గా ఎప్పటి వరకు కొనసాగుతాడనే విషయమై ఓ సమాచారం అందింది. కోచ్ గా అతడి లాస్ట్ సిరీస్ ఏదనేది తెలిసింది.
టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ గతేడాది బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మిశ్రమ ఫలితాలను అందుకుంటున్నాడు. రాహుల్ ద్రవిడ్ స్థానాన్ని భర్తీ చేసిన అతడు, జట్టు విజయాలను అందుకోవడంలో పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు. లంకపై టీ20 సిరీస్ వైట్వాష్ మొదలు, న్యూజిలాండ్, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆస్ట్రేలియా చేతిలో ఓటమి అతడిపై తీవ్ర ఒత్తిడిని పెంచాయి. ఇదే సమయంలో గంభీర్ ను తప్పించాలన్న డిమాండ్లు వినిపించాయి.

అయితే ఇప్పుడు గంభీర్ ముందు ఇంగ్లాండ్ పర్యటనతో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి కీలకమైన సిరీస్, టోర్నీలు ఉన్నాయి. ఇవి అతడికి అసలు పరీక్షగా మారనుంది. ఇందులో నెగ్గితే గంభీర్ కోచ్ పదవి సేఫ్ గా ఉంటుంది. లేదంటే కనుక, గంభీర్ పై ఒత్తిడి పెరిగి, అతడి కోచ్ పదవి ప్రమాదంలో పడే అవకాశముంది.
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా గంభీర్ కోచ్ పదవి కాలంపై తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. గంభీర్ను ఇప్పుడే విమర్శించడం సరి కాదని చెప్పాడు. బీసీసీఐ గంభీర్ కు మరింత సమయం ఇవ్వొచ్చని అభిప్రాయపడ్డాడు.

'టీమిండియా ఈ ఏడాది ఇంగ్లాండ్ లో ఆడే టెస్టు సిరీస్ వరకు గంభీర్ ను బీసీసీఐ కొనసాగించొచ్చు. ఒకవేళ ఆ సిరీస్ కూడా కోల్పోతే ఇక భారత్ కోచ్ గా అతడికి ఇదే ఆఖరి సిరీస్ అయ్యే అవకాశం ఉంది' అని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో, టీమిండియా విజయాలు సాధించడం కోసం గంభీర్ తదుపరి చర్యలు ఎలా ఉంటాయోనని.. భారత క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.