ఉప్పల్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య జట్టు భారత్కు ఇంగ్లండ్ గట్టిషాక్ ఇచ్చింది. దీంతో టీమిండియా సిరీస్ను కోల్పోతుందేమోనే సందేహాలు పెరిగాయి. దానికి తోడుగా స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ వివిధ కారణాలతో జట్టుకు దూరమయ్యారు. మరోవైపు అనుభవలేమి బ్యాటింగ్ లైనప్. ఇక రోహిత్ సేన పని అయిపోయినట్లే అని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు వ్యాఖ్యానించారు.
కానీ మరో మ్యాచ్ మిగిలుండగానే అయిదు టెస్టుల సిరీస్ను భారత్ 3-1తో కైవసం చేసుకుంది. యువ క్రికెటర్లు యశస్వీ జైస్వాల్, ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, ఆకాశ్ దీప్ సత్తాచాటారు. జైస్వాల్ డబుల్ సెంచరీలతో రికార్డులు బ్రేక్ చేశాడు. కానీ మరో యువ బ్యాటర్ రజత్ పటిదార్ మాత్రం నిరాశపరిచాడు. తనకి వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోలేకపోయాడు.

రజత్ పటిదార్ తన ఆరు ఇన్నింగ్స్ల్లో స్పిన్నర్ల చేతిలోనే ఔటయ్యాడు. వైజాగ్ టెస్టులో అరంగేట్రం చేసిన రజత్ (33, 9 పరుగులు) రెండు ఇన్నింగ్స్ల్లోనూ రెహాన్ అహ్మద్ బౌలింగ్ వెనుదిరిగాడు. అలాగే రాజ్కోట్ టెస్టులో (5, 0) టామ్ హర్ట్లీ బౌలింగ్లో, రాంచీ టెస్టులో (17, 0) షోయబ్ బషీర్ బౌలింగ్లో పెవిలియన్కు చేర్చాడు.
ఈ నేపథ్యంలో రజత్ పటిదార్ స్థానంలో మరో యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్కు అవకాశం ఇవ్వాలని జట్టు యాజమాన్యం భావిస్తోందని తెలుస్తోంది. అంతేగాక తొలుత రజత్ పటిదార్ను రంజీ ట్రోఫీలో పాల్గొనడానికి జట్టు నుంచి విడుదల చేయాలని అనుకున్నట్లు సమాచారం. కానీ కేఎల్ రాహుల్ పూర్తి ఫిట్నెస్ సాధించకపోవడంతో రజత్ పటిదార్ను తుదిజట్టులోకి తీసుకోపోయినప్పటికీ జట్టుతోనే ఉంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
మ్యాచ్ మధ్యలో ఎవరైనా బ్యాటర్ తలకు దెబ్బతగిలితే కంకషన్ సబ్స్టిట్యూట్ కోసం ప్రత్యామ్నాయ బ్యాటర్ ఉండాల్సి ఉంటుంది. కేఎస్ భరత్ జట్టుతో ఉన్నప్పటికే స్పెషలిస్ట్ బ్యాటర్ రజత్ పటిదార్ జట్టుకు ఎక్కువ ఉపయోగపడతాడని యాజమాన్యం ఆలోచిస్తోంది. కాగా, మార్చి 7 నుంచి ధర్మశాల వేదికగా చివరి టెస్టు జరగనుంది. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన కెరీర్లో 100వ టెస్టు ఆడనున్నాడు.