ఇంగ్లండ్తో జరుగుతున్న అయిదు టెస్టుల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే భారత్ 3-1తో కైవసం చేసుకుంది. ప్రత్యర్థి గట్టిపోటీనిచ్చినా యువ క్రికెటర్లు అదరగొట్టి జట్టును గెలిపించారు. అరంగేట్ర టెస్టు సిరీస్లో రజత్ పటిదార్ మినహా సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, ఆకాశ్ దీప్ ఆకట్టుకున్నారు. ధర్మశాల వేదికగా మార్చి 7 నుంచి చివరి టెస్టు ప్రారంభం కానుంది.
అయితే ఈ ఆఖరి మ్యాచ్కు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టుతో చేరనున్నాడని తెలుస్తోంది. పనిభారం దృష్ట్యా అతడిని రాంచీ వేదికగా నాలుగో టెస్టుకు విశ్రాంతి ఇచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు తొడకండరాల గాయం నుంచి కోలుకుంటున్న కేఎల్ రాహుల్ చివరి టెస్టుకు కూడా అందుబాటులో ఉండట్లేదని తెలుస్తోంది. అంతేగాక అతడు చికిత్స కోసం లండన్కు వెళ్లనున్నాడని సమాచారం.

తొలి టెస్టు అనంతరం కేఎల్ రాహుల్ గాయపడిన సంగతి తెలిసిందే. సిరీస్కు ప్రకటించిన జట్టులో రాహుల్ ఉన్నప్పటికీ మైదానంలోకి అడుగుపెట్టలేదు. రాజ్కోట్ వేదికగా జరిగిన మూడో టెస్టు సమయానికి రాహుల్ 90% ఫిట్నెస్ సాధించాడు. నాలుగో టెస్టుకు అయినా పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడనకుంటే సాధ్యం కాలేదు. అయితే రాహుల్ గాయం బీసీసీఐ వైద్యబృందాన్ని కలవరపెడుతోంది. అతని తొడకండరాల గాయంపై స్పష్టత తెలియట్లేదు. మరోవైపు తనకి అసౌకర్యంగా ఉందని రాహుల్ తెలియజేస్తున్నాడు.
గతేడాది రాహుల్ శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అనంతరం వన్డే వరల్డ్ కప్, దక్షిణాఫ్రికా పర్యటనలో బ్యాటుతో పాటు వికెట్ కీపింగ్ చేస్తూ పనిభారాన్ని మోశాడు. ఈ నేపథ్యంలో అతడి గాయం తిరగబెట్టింది. అయితే స్కానింగ్లో గాయంపై స్పష్టత దొరకట్లేదు. వాపు మాత్రమే ఉందని తెలుస్తోంది. దీంతో రాహుల్ రిపోర్ట్లను లండన్కు పంపించారు. అక్కడి వైద్యులు నేరుగా పరిశీలించాలని కోరడంతో రాహుల్ లండన్ బయలుదేరనున్నాడని తెలుస్తోంది. రాహుల్కు మరోసారి సర్జరీ చేయాల్సిన పరిస్థితి వస్తే అతడు ఐపీఎల్కు పూర్తిగా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి.