Jasprit Bumrah: అండర్సన్- టెండుల్కర్ టెస్ట్ సిరీస్ లో భాగంగా భారత్.. తన చివరిదైన అయిదో మ్యాచ్ కోసం ప్రిపేర్ అవుతోంది. ఈ నెల 31వ తేదీన లండన్ కెన్నింగ్టన్ ఓవల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ మొదలవుతుంది. ఇందులో ఓడిపోతే సిరీస్ ను ఇంగ్లాండ్ కు ధారదాత్తం చేసినట్టవుతుంది టీమిండియాకు.
ఇప్పటివరకు జరిగిన నాలుగింట్లో ఇంగ్లాండ్ రెండింట్లో విజయం సాధించింది. 2-1 తేడాతో ఆధిక్యతను సాధించింది. మాంచెస్టర్ లో జరిగిన నాలుగో టెస్ట్ నాటకీయ పరిణామాల మధ్య డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. సిరీస్ ను సొంతం చేసుకోవడానికి ఇంగ్లాండ్, సమం చేయడానికి టీమిండియా శాయశక్తులా ప్రయత్నిస్తోన్నాయి. నెట్ ప్రాక్టీస్ లో నిమగ్నం అయ్యాయి.

ఈ పరిస్థితుల మధ్య టీమిండియాకు బ్యాడ్ న్యూస్ అందింది. సిరీస్ సమం కావాలంటే గెలిచి తీరాల్సిన అయిదో టెస్ట్ మ్యాచ్ కు స్టార్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా దూరం అయ్యాడు. బీసీసీఐ మెడికల్ టీమ్ సలహా మేరకు అతనికి విశ్రాంతి ఇవ్వాలని మేనేజ్మెంట్ నిర్ణయించింది. బుమ్రా స్థానంలో పేసర్ ఆకాష్ దీప్ జట్టులోకి రానున్నాడు.
నిజానికి- వర్క్ లోడ్ కారణంగా నాలుగో టెస్ట్ లో ఆడకపోవచ్చనే అంచనాలు మొదట్లో వ్యక్తం అయ్యాయి. ఆకాశ్ దీప్, నితీష్ కుమార్ రెడ్డి అందుబాటులో లేకపోవడం వల్ల బుమ్రా తుదిజట్టులోకి తీసుకున్నారు అప్పట్లో. ఆకాష్ దీపం అందుబాటులోకి రావడంతో బుమ్రాకు రెస్ట్ లభించడం ఖాయంగా కనిపిస్తోంది.
బుమ్రా సహా ఫాస్ట్ బౌలర్లందరూ వందశాతం ఫిట్గా ఉన్నారని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇటీవలే వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో బుమ్రా అయిదో టెస్ట్ కు అందుబాటులో ఉంటాడని అందరూ భావించారు. జట్టులో వాస్తవ పరిస్థితులు దీనికి భిన్నంగా ఉంటోన్నాయి.
వర్క్ లోడ్ నుంచి బుమ్రా విశ్రాంతి కోరుకుంటోండటం, పైగా వెన్ను నొప్పితో ఇబ్బంది పడుతుండటంతో మేనేజ్మెంట్ అతన్ని అయిదో టెస్టుకు దూరంగా ఉంచబోతోంది. బుమ్రా మూడు టెస్టులు మాత్రమే ఆడతాడంటూ సిరీస్ ఆరంభానికి ముందే గంభీర్, కెప్టెన్ శుభ్మన్ గిల్ వెల్లడించారు కూడా.