
లండన్: బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ స్టేడియం వేదికగా ఇంగ్లాండ్తో కొనసాగుతున్న అయిదో టెస్ట్ మ్యాచ్పై భారత జట్టు పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్లో భారీ ఆధిక్యాన్ని సాధించింది. రెండో ఇన్నింగ్లో కాస్త తడబడినప్పటికీ.. ఆ తరువాత నిలదొక్కుకుంది. రెండో ఇన్నింగ్లో ఓపెనర్ శుభ్మన్ గిల్, హనుమ విహారి, విరాట్ కోహ్లీ వికెట్లను కోల్పోయింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి చేతేశ్వర్ పుజారా-50, తొలి ఇన్నింగ్ సెంచరీ హీరో, వికెట్ కీపర్ రిషభ్ పంత్-30 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.
ప్రస్తుతం 257 పరుగుల ఆధిక్యతలో ఉంది భారత్. ఇవ్వాళ ఇన్నింగ్ను డిక్లేర్ చేసే అవకాశాలు లేకపోలేదు. చివరి గంటలో ఇన్నింగ్ను డిక్లేర్ చేసి, బౌలింగ్ విజృంభించాలనేది టీమిండియా గేమ్ ప్లాన్గా కనిపిస్తోంది. చివరి గంటలో వీలైనన్ని వికెట్లను పడగొట్టడం ద్వారా ఇంగ్లాండ్ను ఒత్తిడిలోకి నెట్టాలనేది టీమిండియా వ్యూహం. టెస్ట్ మ్యాచ్ అయిదో రోజులో ప్రవేశించే సమయానికి ఇంగ్లాండ్ జట్టు.. ఒత్తిడిలో ఉండేలా ప్లాన్ రూపొందించుకుంది.
రెండో ఇన్నింగ్లో టీమిండియా తడబడింది. ప్రారంభంలోనే వికెట్ కోల్పోయింది. నాలుగు పరుగుల వద్ద శుభ్మన్ గిల్ అవుట్ అయ్యాడు. 43 పరుగుల వద్ద హనుమ విహారి, 75 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ అవుట్ అయ్యారు. మరో ఓపెనర్ చేతేశ్వర్ పుజారా క్రీజ్లో పాతుకుపోయాడు. అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. నాటౌట్గా నిలిచాడు. రిషభ్ పంత్తో కలిసి 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వికెట్లు పడుతున్న దశలో ఇంగ్లాండ్ బౌలర్లకు ఎదురొడ్డి నిలిచాడు పుజారా.
అతని బ్యాటింగ్పై ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రతికూల పరిస్థితుల్లో క్రీజ్లో పాతుకుపోయాడని, బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడని కితాబిచ్చాడు. పుజారాను ఓ యోధుడిగా అభివర్ణించారు. ఇదివరకు ఆస్ట్రేలియాలో తన సత్తా చాటాడని, ఇప్పుడు ఇంగ్లాండ్ గడ్డపైనా తానేమిటో నిరూపించుకున్నాడని చెప్పాడు. జట్టుకు అవసరం వచ్చిన ప్రతీసారీ పుజారా.. తాను ఉన్నానంటూ అండగా నిలుస్తున్నాడని ప్రశంసించాడు.
పుజారా బౌలర్లను బాగా ఇరిటేట్ చేస్తాడని సిరాజ్ చెప్పుకొచ్చాడు. ఇబ్బంది పెట్టే బంతులను అలవోకగా ఆడేస్తాడని, ఊరించే బంతులను వదిలేస్తాడని, ఇది బౌలర్ను తీవ్ర అసహనానికి గురి చేస్తుందని అన్నాడు. నెట్స్ ప్రాక్టీస్ సమయంలో పుజారాకు బౌలింగ్ చేయడం అంటే సవాల్తో కూడుకున్న పనిగా చెప్పుకొచ్చాడు సిరాజ్. అతనికి బౌలింగ్ చేయడం అంటే బౌలర్.. తనను తాను నిరూపించుకున్నట్టే అవుతుందని అన్నాడు.