
లండన్: ఇంగ్లాండ్తో బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ స్టేడియలో జరుగుతున్న అయిదో టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు పటిష్ట స్థితికి చేరుకుంది. రెండో రోజు ఆట దూకుడుగా మొదలు పెట్టింది. ప్రారంభ ఓవర్లలో పరుగుల వరద పారించింది. నైట్ వాచ్మెన్ మహ్మద్ షమీ వరుస బౌండరీలతో స్కోర్ బోర్డును పరుగులెత్తిస్తోన్నాడు. మాథ్యూ పాట్స్ సంధించిన 77వ ఓవర్లో బ్యాక్ అండ్ బ్యాక్ బౌండరీలు కొట్టాడు. బెన్ స్టోక్స్ వేసిన ఆ తరువాతి ఓవర్లోనూ రెండు ఫోర్లు నమోదయ్యాయి. రవీంద్ర జడేజా, షమీ చెరో బౌండరీ కొట్టారు.
రవీంద్ర జడేజా సెంచరీ సాధించాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 83 పరుగులతో నాటౌట్గా ఉన్న రవీంద్ర జడేజా తొలి సెషన్లోనే సెంచరీ కొట్టాడు. టెస్ట్ మ్యాచ్లల్లో అతనికి ఇది మూడో సెంచరీ. ఈ ఏడాదిలో అతను చేసిన రెండో సెంచరీ. మాథ్యూ పాట్ వేసిన 79వ ఓవర్ చివరి రెండు బంతులను బౌండరీలకు తరలించి మరీ.. రవీంద్ర జడేజా వంద పరుగుల ల్యాండ్ మార్క్ను అందుకున్నాడు. తనదైన స్టైల్లో బ్యాట్ను కత్తిలా తిప్పుతూ సెంచరీని సెలబ్రేట్ చేసుకున్నాడు.
టీమిండియా ఇన్నింగ్లో నమోదైన రెండో సెంచరీ ఇది. తొలి రోజు వికెట్ కీపర్ రిషభ్ పంత్ 146 పరుగులతో కదం తొక్కిన విషయం తెలిసిందే. కాగా 80వ ఓవర్లో మహ్మద్ షమీ అవుట్ అయ్యాడు. స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఆ ఓవర్ నాలుగో బంతిని థర్డ్ మ్యాన్ దిశగా ఆడబోగా.. బంతి షమీ బ్యాట్ను తాకి గాల్లోకి లేచింది. అక్కడే ఉన్న లీచ్ దాన్ని అందుకున్నాడు. దీనితో 371 పరుగులకు ఎనిమిది వికెట్లను కోల్పోయినట్టయింది టీమిండియా. ప్రస్తుతం 100 పరుగులతో రవీంద్ర జడేజా, సున్నాతో కేప్టెన్ జస్ప్రీత్ బుమ్రా క్రీజ్లో ఉన్నారు.
సెంచరీ హీరో రవీంద్ర జడేజా క్రీజ్లో ఉండటం వల్ల భారత్ 400 పరుగుల మార్క్ను అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అతని ఆటతీరు కూడా అదే రేంజ్లో ఉంది. నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో టెయిలెండర్లు ఉన్నందున.. సాధ్యమైనంత వరకు తానే స్ట్రైక్ తీసుకుంటోన్నాడు. జట్టు భారీ స్కోర్ చేయాలంటే జడేజా మరికొన్ని ఓవర్ల పాటు క్రీజ్లో నిల్చోక తప్పదు. వీరిద్దరి తరువాత మహ్మద్ సిరాజ్ క్రీజ్లో వస్తాడు. బ్యాటింగ్ విషయంలో అతని మీద పెద్దగా ఆశల్లేకపోవడం వల్ల.. బౌలర్లను ఎదుర్కొనడానికే జడేజా ప్రాధాన్యత ఇస్తోన్నాడు.