అయిదు టెస్టుల సిరీస్లో భాగంగా ధర్మశాల వేదికగా ఇంగ్లండ్తో జరగనున్న చివరి టెస్టుకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చాడు. ఊహించినట్లుగానే కేఎల్ రాహుల్ ఆఖరి టెస్టుకు దూరమయ్యాడు. మరోవైపు రంజీ ట్రోఫీ సెమీఫైనల్ కోసం ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ను జట్టు నుంచి విడుదల చేశారు. అయితే జట్టు అవసరాలను బట్టి అతడు తిరిగి టీమిండియాతో చేరతాడని సెక్రటరీ జై షా నేతృత్వంలో బీసీసీఐ ప్రెస్నోట్ రిలీజ్ చేసింది.
ఈసారి జట్టు ప్రకటనతో పాటు స్టార్ క్రికెటర్లు మహ్మద్ షమి, కేఎల్ రాహుల్ గాయాలపై వివరణ ఇచ్చింది. ''రాహుల్ను బీసీసీఐ వైద్యబృందం నిశితంగా పరిశీలిస్తుంది. లండన్ వైద్యుల సమన్వయంతో చికిత్స అందిస్తోంది. ఇక నాలుగో టెస్టుకు ముందు జట్టు నుంచి విడుదల అయిన బుమ్రా తిరిగొచ్చాడు. మరోవైపు వాషింగ్టన్ సుందర్ను స్క్వాడ్ నుంచి రిలీజ్ చేశాం. మార్చి 2వ తేదీ నుంచి ప్రారంభమయ్యే రంజీట్రోఫీ సెమీఫైనల్లో తమిళనాడు తరఫున సుందర్ బరిలోకి దిగుతాడు''

''సెమీస్ ముగిసిన అనంతరం అవసరాలను బట్టి సుందర్ భారత జట్టుతో చేరుతాడు. కాగా, కుడి చీలమండ సమస్యతో బాధపడున్న మహ్మద్ షమి ఫిబ్రవరి 26న శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ప్రస్తుతం బాగానే కోలుకుంటున్నాడు. త్వరలో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)కు వెళ్లి చికిత్స పొందుతాడు'' అని ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. మార్చి 7వ తేదీ నుంచి ఆఖరి టెస్టు ప్రారంభం కానుంది. ఇప్పటికే భారత్ 3-1తో సిరీస్ను కైవసం చేసుకుంది.
టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, రజత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ , కేఎస్ భరత్ , దేవదత్ పడిక్కల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, ఆకాశ్ దీప్.