ఇంగ్లాండ్ తో జరిగిన ఐదో టీ20లో టీమిండియా వరుణ్ చక్రవర్తి రెండు కీలక వికెట్లు తీసి అదరగొట్టాడు. తద్వారా
ఓ ద్వైపాక్షిక సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్ బౌలర్గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ సిరీస్ లో అతడు మొత్తంగా 14 వికెట్లు పడగొట్టి.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును దక్కించుకున్నాడు.
ఈ సందర్భంగా తనకు ఈ సిరీస్ అవార్డు దక్కడంపై హర్షం వ్యక్తం చేశాడు. ఈ పురస్కారాన్ని తన కుటంబానికి అంకితం చేస్తున్నట్లు పేర్కొన్నాడు. "ఫీల్డింగ్ లోనూ మంచిగా రాణించడం ఆనందంగా ఉంది. జట్టు ఫీల్డింగ్ ప్రమాణాలను మెరుగుపరచడంపై దృష్టి సారిస్తోంది. నేను మా ఫీల్డింగ్ కోచ్తో కలిసి మంచిగా రాణించేందుకు పని చేస్తున్నాను. ఇది మంచి ఫలితాన్ని ఇస్తోంది. ఇప్పటివరకు నేను చేసిన బౌలింగ్ లో ఇదే బెస్ట్. నేను అత్యుత్తమంగా బౌలింగ్ వేశాను. కానీ, మరింత మెరుగు కావడానికి ఇంకా చాలా అవకాశం ఉంది. కొన్ని బంతులు మాత్రం నేను సరిగ్గా వేయలేదు. సరైన బంతిని సరైన సమయంలో సంధించాలి. ప్రస్తుతం దాని మీద ఫోకస్ పెట్టాను. ఏదేమైనా ఈ ప్రదర్శన నాకెంతో ప్రత్యేకం. ఈ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ను నా భార్య, తల్లిదండ్రులు, కుమారుడికి అంకితం చేస్తున్నాను. నాకు మద్దతుగా నిలిచిన గంభీర్, సూర్యకు ప్రత్యేక కృతజ్ఞతలు" అని వరుణ్ చక్రవర్తి సంతోషం వ్యక్తం చేశాడు.

ఈ సిరీస్లో వరుణ్ చక్రవర్తి చేసిన ప్రదర్శన ఇదే
మొదటి టీ20లో 3/23 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డను దక్కించుకున్నాడు వరుణ్ చక్రవర్తి. రెండో టీ20లో 2/38 బౌలింగ్ ఫిగర్లను నమోదు చేశాడు. మూడో టీ20లో మళ్లీ అదిరే ప్రదర్శన చేసి 5/24 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు.ఇక నాలుగో టీ20లో 2/28 వికెట్లు తీయగా.. ఐదో టీ20లో 2/25 నమోదు చేశాడు. మొత్తంగా 14 వికెట్లను తీసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు.