
లండన్: బర్మింగ్ హామ్లోని ఎడ్జ్బాస్టన్ స్టేడియం వేదికగా ఇంగ్లాండ్తో తలపడుతోన్న టెస్ట్ మ్యాచ్పై భారత్దే ఆధిపత్యం. ఇంగ్లాండ్ జట్టు ఫాలో ఆన్ను ఎదుర్కొనే ప్రమాదంలో పడినట్టే కనిపిస్తోంది. కేప్టెన్ జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరిగే బంతులను సంధిస్తోన్నాడు. రెండో రోజు ఇంగ్లాండ్ జట్టు 84 పరుగులకు అయిదు వికెట్లను కోల్పోయింది. ఇందులో మూడు.. బుమ్రా కూల్చినవే. మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.
తొలి ఇన్నింగ్లో 416 పరుగులు చేసిన భారత జట్టు- రెండో ఇన్నింగ్లో బంతితో విజృంభిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు అయిదు వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ మొత్తం పెవిలియన్కు పంపించారు బౌలర్లు. అలెక్స్ లీస్-6, జాక్ క్రాలీ-9, ఒల్లె పోప్-10, జో రూట్-31, జాక్ లీచ్-0 పరుగులకు అవుట్ అయ్యారు. జానీ బెయిర్స్టో-12, కేప్టెన్ బెన్ స్టోక్స్-0 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.
ఈ మ్యాచ్లో మూడు వికెట్లు పడగొట్టడంతో జస్ప్రీత్ బుమ్రా మరో ఘనతను సాధించాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ 2021-23 సైకిల్లో ఇప్పటివరకు అత్యధిక వికెట్లను పడగొట్టిన బౌలర్గా నిలిచాడు. మొత్తం 43 వికెట్లు తీసుకున్నాడీ ఫాస్ట్ బౌలర్. 10 మ్యాచ్లల్లో 18 ఇన్నింగ్స్లో 43 వికెట్లు తీసుకున్నాడు. 79 మెయిడెన్ ఓవర్లు సంధించాడు. ఓ ఇన్నింగ్లో బెస్ట్ బౌలింగ్ 5/24. మ్యాచ్ మొత్తంలో బెస్ట్ బౌలింగ్ ఫిగర్ 110 పరుగులకు తొమ్మిది వికెట్లు తీసుకున్నాడు. దీన్ని సవరించుకునే అవకాశాలు లేకపోలేదు.
రెండో స్థానంలో ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ అండర్సన్ ఉన్నాడు. 10 మ్యాచ్లల్లో 39 వికెట్లు తీసుకున్నాడు. పాకిస్తాన్కు చెందిన పేసర్ షహీన్షా అఫ్రిది 37 వికెట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియా స్పిన్నర్ లియాన్ కూడా 37 వికెట్లతో ఫోర్త్ పొజీషన్లో ఉన్నాడు. ఆస్ట్రేలియాకే చెందిన పాట్ కమ్మిన్స్-34, న్యూజిలాండ్ బౌలర్ టిమ్ సౌథీ-33, రాబిన్సన్-32, వెస్టిండీస్ బౌలర్ సీల్స్-31, భారత్ స్పీడ్స్టర్ మహ్మద్ షమీ-31, దక్షిణాఫ్రికాకు చెందిన కగిసొ రబడ-30 వికెట్లతో తొలి 10 స్థానాల్లో ఉన్నారు.