IND vs ENG: భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో నాలుగో మ్యాచ్ జులై 23న మాంచెస్టర్లో జరగనుంది. 3 మ్యాచ్ల తర్వాత సిరీస్లో ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలో ఉంది. టీమిండియా కోణం నుంచి ఈ మ్యాచ్ చాలా కీలకం. ఎందుకంటే మాంచెస్టర్లో ఓడితే భారత్ సిరీస్ను కోల్పోతుంది. మరోవైపు ఇంగ్లాండ్ జట్టు మరో విజయం సాధించి సిరీస్లో 3-1తో అజేయ ఆధిక్యం సాధించాలని కోరుకుంటోంది. మ్యాచ్ ప్రారంభవం కావడానికి ముందు భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ నాలుగో టెస్టులో బద్దలయ్యే 5 పెద్ద రికార్డుల గురించి తెలుసుకుందాం.
నెలకొల్పబడే రికార్డులు ఇవే..
ఇంగ్లాండ్ కింగ్గా జస్ప్రీత్ బుమ్రా: జస్ప్రీత్ బుమ్రా ఇప్పటివరకు ఇంగ్లాండ్ గడ్డపై ఆడుతూ 4 సార్లు ఒకే ఇన్నింగ్స్లో 5 వికెట్ల హాల్ సాధించాడు. మాంచెస్టర్లో ఆడుతూ ఒకే ఇన్నింగ్స్లో 5 వికెట్లు పడగొడితే, ఇంగ్లాండ్లో అత్యధికంగా 5 వికెట్ల హాల్స్ సాధించిన వారిలో ముత్తయ్య మురళీధరన్తో సమం చేస్తాడు. ముత్తయ్య మురళీధరన్ ఇంగ్లాండ్లో 5 సార్లు 5 వికెట్ల హాల్ సాధించాడు.

గొప్ప రికార్డుకు చేరువలో రిషబ్ పంత్: భారత వికెట్ కీపర్, బ్యాటర్గా అత్యధిక పరుగులు చేసిన 61 ఏళ్ల రికార్డ్ను రిషబ్ పంత్ బద్దలు కొట్టే అవకాశం ఉంది. రిషబ్ పంత్ ఒక గొప్ప రికార్డును తన ఖాతాలో వేసుకోవడానికి కేవలం 101 పరుగుల దూరంలో ఉన్నాడు. వాస్తవానికి ఒకే టెస్ట్ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన భారత రికార్డు ఇప్పటికీ భారత మాజీ వికెట్ కీపర్, బ్యాటర్ బుద్ధి కుందరన్ పేరిట ఉంది. ఆయన 1963-64లో ఇంగ్లాండ్ జట్టుపై టెస్ట్ సిరీస్లో 525 పరుగులు సాధించారు. ఇప్పుడు ఇంగ్లాండ్పై ప్రస్తుత సిరీస్లో రిషబ్ పంత్ ఇప్పటికే 425 పరుగులు చేశాడు. పంత్ మరో 101 రన్స్ చేస్తే 61 ఏళ్ల రికార్డ్ బద్ధలవుతుంది.
ఓపెనర్గా చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్: కేఎల్ రాహుల్ ఇంగ్లాండ్పై 1,000 పరుగులు పూర్తి చేయడానికి కేవలం 11 పరుగుల దూరంలో ఉన్నాడు. కేఎల్ రాహుల్ 11 పరుగులు సాధిస్తే, సునీల్ గవాస్కర్ తర్వాత ఇంగ్లాండ్పై టెస్టుల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన రెండో భారత ఓపెనర్గా నిలుస్తాడు.
జో రూట్ మహారికార్డు: ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ ఇప్పటివరకు తన టెస్ట్ కెరీర్లో 37 సెంచరీలు సాధించాడు. వీటిలో 11 సెంచరీలు భారత్పై వచ్చాయి. స్టీవ్ స్మిత్ కూడా టీమిండియాపై ఇన్ని టెస్ట్ సెంచరీలు సాధించాడు. కేవలం ఒక సెంచరీ ఇన్నింగ్స్ ఆడితే, జో రూట్ భారత్పై టెస్ట్ క్రికెట్లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాటర్గా నిలుస్తాడు.
చరిత్ర సృష్టించే దిశగా టీమిండియా: మాంచెస్టర్ టెస్టుల్లో ఆటగాళ్లే కాకుండా టీమిండియా కూడా ఒక చారిత్రాత్మక రికార్డును తన ఖాతాలో వేసుకోవచ్చు. భారత్ మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో ఇప్పటివరకు ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా గెలవలేదు. ఒకవేళ నాలుగో టెస్టులో భారత్ గెలిస్తే అది మాంచెస్టర్లో టీమిండియాకు మొదటి టెస్ట్ విజయం అవుతుంది.