IND vs ENG 4th test: ఇంగ్లాండ్ తో జరుగుతున్న అండర్సన్- టెండుల్కర్ టెస్ట్ సిరీస్ లో భారత్ వెనుకంజలో ఉంది. గెలవాల్సిన మూడో మ్యాచ్ ఘోరంగా ఓడిపోయింది. చేతులకు అందిన మ్యాచ్ ను నోటి దాకా తీసుకెళ్లడంలో విఫలమైంది. 22 పరుగుల తేడాతో మట్టికరిచింది. అయిదు మ్యాచ్ ల ఈ సిరీస్ లో 2-1 తేడాతో వెనుకపడింది.
ఈ పరిస్థితుల మధ్య నాలుగో టెస్ట్ ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది భారత్. ఈ మ్యాచ్ ఈ నెల 23వ తేదీన ఆరంభం కానుంది. మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియం దీనికి వేదిక. ఇందులో గెలిచి.. సిరీస్ ను సమం చేయాలనే పట్టుదలతో ఉంది టీమిండియా. దీనికోసం నెట్స్ లో చెమటోడుస్తోంది.

ఇప్పటికే సిరీస్ పై పట్టు సాధించిన ఇంగ్లాండ్.. మాంచెస్టర్ టెస్ట్ ను కైవసం చేసుకోవడానికి ఉవ్విళ్లూరుతోంది. సిరీస్ డిసైడర్ ఇది. ఇందులో గెలిస్తే- సిరీస్ ఇంగ్లాండ్ వశమౌతుంది. చివరి మ్యాచ్.. ఆధిక్యతను మరింత పెంచుకోవడానికో, తగ్గించుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది.
ఈ పరిస్థితుల మధ్య భారత్ ను ఢీకొట్టబోయే జట్టును ఇంగ్లాండ్ ప్రకటించింది. సుదీర్ఘ విరామం అనంతరం లియామ్ డాసన్ తిరిగి ఇంగ్లాండ్ టెస్ట్ జట్టులోకి వచ్చాడు. దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత అతనికి టెస్ట్ జట్టులో చోటు దక్కడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
లార్డ్స్ టెస్టులో గాయపడిన షోయబ్ బషీర్ స్థానంలో డాసన్ జట్టులోకి వచ్చాడు. బషీర్ ఎడమ చేతి వేలికి గాయం కావడంతో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. దీంతో డాసన్కు అవకాశం లభించింది. 35 ఏళ్ల డాసన్ చివరిసారిగా 2017లో నాటింగ్హామ్లో దక్షిణాఫ్రికాపై టెస్ట్ మ్యాచ్ ఆడాడు. అంతకుముందు సంవత్సరం అంటే- 2016లో చెన్నైలో భారత్తో జరిగిన మ్యాచ్లో అరంగేట్రం చేశాడు.
ఇప్పటివరకు మూడు టెస్ట్ మ్యాచ్లు ఆడి 7 వికెట్లు తీశాడు. బ్యాటింగ్లో 66 పరుగులు చేశాడు. చాలాకాలంగా డాసన్ టీ20 లీగ్ మ్యాచ్ లను ఆడుతున్నాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్లో అతనికి మంచి అనుభవం ఉంది. ఇప్పటివరకు 212 మ్యాచ్లలో 10,731 పరుగులు చేశాడు. 371 వికెట్లు తీశాడు. డాసన్ రాకతో ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఆర్డర్ మరింత బలంగా తయారైందని హ్యారీ బ్రూక్ అన్నాడు.
మాంచెస్టర్ టెస్ట్ కోసం ఇంగ్లాండ్ ప్రకటించిన తుది జట్టులో- జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కేప్టెన్), జెమీ స్మిత్ (వికెట్ కీపర్), లియామ్ డాసన్, క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్స్, జోఫ్రా ఆర్చర్ ఆడనున్నారు.