IND vs ENG: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్లో ఇరు జట్లు ఒక్కో విజయం సాధించి సిరీస్ను 1-1తో సమం చేశాయి. ఈ నేపథ్యంలో మూడో టెస్ట్ మ్యాచ్ గురువారం(జులై 10) నుంచి చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో ప్రారంభం కానుంది. టీమిండియాతో జరగనున్న మూడో టెస్ట్ మ్యాచ్ కోసం 16 మంది సభ్యుల ఇంగ్లాండ్ జట్టును ప్రకటించారు. ఇంగ్లండ్ జట్టులో గాయం కారణంగా తొలి రెండు మ్యాచ్లకు దూరంగా ఉన్న స్టార్ పేస గస్ అట్కిన్సన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. మిగతా జట్టులో ఎలాంటి మార్పులు లేవు.
ఇంగ్లండ్ జట్టులో కీలక మార్పులు
టీమిండియాతో జరిగిన రెండో టెస్టుకు ముందు మరో స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ జట్టులోకి తిరిగి వచ్చాడు. అయితే మొదటి మ్యాచ్ గెలవడంతో ఇంగ్లాండ్ రెండో టెస్టులోనూ అదే జట్టును కొనసాగించింది. దీంతో జోఫ్రా ఆర్చర్కు తుది జట్టులో అవకాశం దక్కలేదు. మూడో టెస్ట్ తుది జట్టులో జోఫ్రా ఆర్చర్ లేదా గస్ అట్కిన్సన్లలో ఎవరో ఒకరికి అవకాశం దక్కుంది. ఇప్పటివరకు జరిగిన రెండు టెస్టుల్లో అంతగా ప్రభావం చూపని క్రిస్ వోక్స్ స్థానంలో జోఫ్రా ఆర్చర్ లేదా అట్కిన్సన్ను ఆడించే అవకాశం ఉంది. మిగతా జట్టు మొత్తం యధాతథంగా కొనసాగే అవకాశం ఉంది.

మూడో టెస్టు కోసం ఇంగ్లండ్ జట్టు ఇదే..
బెన్ స్టోక్స్(కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, షోయబ్ బషీర్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడాన్ కార్స్, సామ్ కుక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, జామీ ఓవర్టన్, ఓలీ పోప్, జో రూట్, జామీ స్మిత్, జోష్ టంగ్, క్రిస్ వోక్స్
రెండో టెస్ట్లో భారత్ ఘన విజయం
ఇంగ్లండ్ కంచుకోటగా భావించే బర్మింగ్హామ్లో టీమిండియా తొలిసారిగా ఇంగ్లండ్ జట్టును ఓడించింది. ఎడ్జ్బాస్టన్లో రెండో టెస్టులో ఇంగ్లండ్ 336 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. గతంలో ఈ వేదికపై ఇంగ్లండ్ జట్టుపై 8 టెస్టులు ఆడగా.. 7 మ్యాచ్ల్లో ఓటమిని చవిచూసింది. 1967 తర్వాత భారత జట్టు ఇంగ్లండ్ జట్టును వారి సొంతగడ్డపై ఓడించడం ఇదే తొలిసారి. 58 ఏళ్ల నిరీక్షణ ఇప్పుడు ఫలించింది. 608 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ 271 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. ఆకాష్ దీప్ అద్భుతంగా బౌలింగ్ చేసి రెండో ఇన్నింగ్స్ లో 6 వికెట్లు పడగొట్టాడు. మొదటి ఇన్నింగ్స్లో 4 వికెట్లు పడగొట్టిన ఆకాష్ దీప్ మొత్తం 10 వికెట్ల ఘనతను సాధించాడు.
రెండో టెస్టులో శుభ్మన్ గిల్ తొలి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్లో సెంచరీ చేసి టీమిండియా గెలుపులో ప్రధాన పాత్ర పోషించాడు. అంతకు ముందు లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. నాలుగో టెస్ట్ మ్యాచ్ జులై 23 నుంచి ఓల్డ్ ట్రాఫోర్డ్లో, ఐదో టెస్టు జులై 31 నుంచి ఓవల్లో జరగనుంది.