
హెడ్డింగ్లీ: భారత్-ఇంగ్లండ్ మూడో టెస్టు రెండో రోజున ఆతిథ్య జట్టు నిలకడగా ఆడుతోంది. భోజన విరామ సమయానికి రూట్ సేన 68 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. ప్రస్తుతం డేవిడ్ మలాన్ 27 (49) , జో రూట్ (14) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ ప్రస్తుతం 104 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ ఫామ్ చూస్తే.. రూట్ సేన భారీ స్కోర్ చేసే అవకాశం ఉంది. అంతకుముందు ఓపెనర్లు రోరీ బర్న్స్, హసీబ్ హమీద్లు నిలకడగా ఆడి జట్టుకు కీలక భాగస్వామ్యాన్ని అందించారు. బర్న్స్ (61), హమీద్ (68) పరుగులు చేశారు. మొహ్మద్ షమీ, రవీంద్ర జడేజా తలో వికెట్ పడగొట్టారు.
120/0 ఓవర్నైట్ స్కోర్తో గురువారం ఆట ప్రారంభించిన ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు నిలకడగా ఆడింది. తొలి రోజే హాఫ్ సెంచరీలు చేసిన ఓపెనర్లు రోరీ బర్న్స్, హసీబ్ హమీద్లు వికెట్ కాపాడుకున్నారు. ఆచితూచి ఆడుతూ స్కోర్ వేగం పెంచే ప్రయత్నం చేశారు. మొదటగా మొహ్మద్ షమీ.. బర్న్ను బౌల్డ్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ 135 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఓవర్నైట్ స్కోర్కు ఇంగ్లండ్ ఓపెనర్లు మరో 15 పరుగులు మాత్రమే జోడించారు. అనంతరం హమీద్కు డేవిడ్ మలాన్ జత కలిశాడు. మరో 24 పరుగుల అనంతరం జడేజా.. హమీద్ను బౌల్డ్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ 159 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.
ఓపెనర్ల అనంతరం జోడీ కట్టిన డేవిడ్ మలన్, జో రూట్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు. భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ పరుగులు చేశారు. చెత్త షాట్లకు పోకుండా వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ జోడీని విడదీసేందుకు ఎంత ప్రయత్నించినా.. కుదరలేదు. ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ సిరాజ్ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. మలన్, రూట్ జోడి మరో వికెట్ పడకుండా తొలి సెషన్ను ముగించారు. దాంతో ఇంగ్లండ్ మెరుగైన స్థితిలో కొనసాగుతోంది. ప్రస్తుతం ఆ జట్టు ఆధిక్యం 104 పరుగులుగా నమోదైంది. ఈ సెషన్లో కూడా ఇంగ్లండ్ ఆధిపత్యం చెలాయించింది.
తొలిరోజు అట ముగిసేసమయానికి ఇంగ్లండ్ 42 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 120 రన్స్ చేసిన విషయం తెలిసిందే. ఓపెనర్లు రోరీ బర్న్స్ (52; 125 బంతుల్లో 5x4, 1x 6), హసీబ్ హమీద్ (60; 130 బంతుల్లో 11x4) హాఫ్ సెంచరీలు చేశారు. అంతకుముందు ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి భారత్ తొలి ఇన్నింగ్స్లో 78 పరుగులకే ఆలౌట్ అయింది. .కేఎల్ రాహుల్ (0), చేతేశ్వర్ పుజారా (1), విరాట్ కోహ్లీ (7), రిషబ్ పంత్ (2), రోహిత్ శర్మ (19), అజింక్య రహానే (18), రవీంద్ర జడేజా (4)లు తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. అండర్సన్, ఓవర్టన్ మూడు వికెట్లు పడగొట్టగా.. రాబిన్సన్, కరన్ తలో రెండు వికెట్లు తీశారు.