
లీడ్స్: రెండో టెస్టులో టీమిండియాపై ఇంగ్లండ్ ఆధిపత్యం కొనసాగుతోంది. గురువారం రెండో రోజు రెండో సెషన్లోనూ ఇంగ్లండ్ మెరుగైన ఆటతీరు ప్రదర్శించింది. కెప్టెన్ జో రూట్ (80), డేవిడ్ మలన్ (70) మూడో వికెట్కు 139 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలోనే ఆ జట్టు టీ బ్రేక్ సమయానికి 94 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. ఈ సెషన్ ముగిసేముందు మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్లో మలన్ ఔటయ్యాడు. ప్రస్తుతం ఆతిథ్య జట్టు ఆధిక్యం 220 పరుగులుగా నమోదైంది. రెండో సెషన్లో కూడా రూట్ సేన ఆధిపత్యం చెలాయించింది. దాదాపుగా ఈ మ్యాచ్ భారత్ చేజారినట్టే.
120/0 ఓవర్నైట్ స్కోర్తో గురువారం ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు నిలకడగా ఆడింది. తొలి రోజే హాఫ్ సెంచరీలు చేసిన ఓపెనర్లు రోరీ బర్న్స్, హసీబ్ హమీద్లు వికెట్ కాపాడుకున్నారు. ఆచితూచి ఆడుతూ స్కోర్ వేగం పెంచే ప్రయత్నం చేశారు. మొదటగా మొహ్మద్ షమీ.. బర్న్ను బౌల్డ్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ 135 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఓవర్నైట్ స్కోర్కు ఇంగ్లండ్ ఓపెనర్లు మరో 15 పరుగులు మాత్రమే జోడించారు. అనంతరం హమీద్కు డేవిడ్ మలాన్ జత కలిశాడు. మరో 24 పరుగుల అనంతరం జడేజా.. హమీద్ను బౌల్డ్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ 159 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.
ఓపెనర్ల అనంతరం జోడీ కట్టిన డేవిడ్ మలన్, జో రూట్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు. భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ పరుగులు చేశారు. చెత్త షాట్లకు పోకుండా వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ జోడీని విడదీసేందుకు ఎంత ప్రయత్నించినా.. కుదరలేదు. ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ సిరాజ్ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఈ క్రమంలో మలన్, రూట్ జోడి మరో వికెట్ పడకుండా తొలి సెషన్ను ముగించారు. దాంతో ఇంగ్లండ్ మెరుగైన స్థితిలోకి దూసుకెళ్లింది. లంచ్ సమయానికి ఇంగ్లండ్ ఆధిక్యం 104 పరుగులుగా నమోదైంది. మొదటి సెషన్లో ఇంగ్లండ్ పూర్తికి ఆధిపత్యం చెలాయించింది.
భోజన విరామ సమయానికి 182/2తో ఉన్న ఇంగ్లండ్ జట్టును రూట్, మలన్ ఆదుకున్నారు. ముఖ్యంగా ఇంగ్లీష్ సారథి వన్డే ఇన్నింగ్స్ ఆడాడు. అతడికి మలన్ నుంచి పూర్తి సహకారం అందింది. ఈ క్రమంలోనే రూట్ తొలుత అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఆపై మలన్ కూడా వేగంగా పరుగులు సాధించి ఈ సిరీస్లో తొలి మ్యాచ్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. దాంతో 2012 తర్వాత తొలిసారి ఒకే ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ టాప్ నలుగురు బ్యాట్స్మెన్ అర్ధ శతకాలతో రాణించారు. ఇక టీ బ్రేక్ సమయానికి ముందు మలన్ (70) మూడో వికెట్గా వెనుదిరిగాడు. దాంతో మలన్, రూట్ మధ్య 139 పరుగుల కీలక భాగస్వామ్యంకు తెరపడింది. రెండో సెషన్లో రూట్ సేన మొత్తం 26 ఓవర్లు బ్యాటింగ్ చేసి 116 పరుగులు సాధించి ఒక వికెట్ నష్టపోయింది.