ఇంగ్లాండ్ తో జరిగిన మూడో టీ20లో టీమిండియా ఓటమిపై మాజీ క్రికెటర్లు స్పందిస్తున్నారు. ఓటమి గల కారణాలను విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో హార్దిక్ పాండ్య చాలా నెమ్మదిగా ఆడటం ఈ ఓటమికి కారణం అని అన్నారు. మిడిల్ ఓవర్లలో చాలా బంతులను వృథా చేయడం వల్లే భారత జట్టు ఓటమి చెందిందని అన్నారు.
ఈ మూడో టీ20 మ్యాచ్లో హార్దిక్ పాండ్య 35 బంతుల్లో 40 పరుగులు చేసి.. ఈ పోరులో టీమిండియా తరఫున అత్యధిక స్కోరు నమోదు చేసిన బ్యాటర్గా నిలిచాడు. అయినప్పటికీ జట్టును ఓటమి నుంచి తప్పించలేకపోయాడు. దీంతో ఇంగ్లాండ్ నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక భారత్ 145 పరుగులకే కుప్పకూలింది.

ఈ నేపథ్యంలోనే భారత్ ఓటమికి కారణం హార్దిక్ పాండ్య అని విమర్శించారు మాజీ క్రికెటర్లైన పార్థివ్ పటేల్, కెవిన్ పీటర్సన్. అతడు స్ట్రైక్ను రొటేట్ చేయడంలో విఫలమయ్యాడని అన్నారు . టీ20ల్లో క్రీజ్లో కుదురుకోవడానికి చాలా తక్కువ బంతులు తీసుకోవాలని.. 20, 25 బంతులు తీసుకోవడం సరికాదని పేర్కొన్నారు.
"హార్దిక్ 35 బంతుల్లో 40 పరుగులు మాత్రమే చేశాడు. మ్యాచ్ క్లిష్ట పరిస్థితులోకి చేజారినప్పుడు దూకుడుగా ఆడాలి. పాండ్య అలా చేయలేదు. ఇన్నింగ్స్ ఆరంభంలో చాలా బంతులను వృథాగా వదిలేశాడు. కనీసం స్ట్రైక్ను రొటేట్ చేయడంలోనూ ఫెయిల్ అయ్యాడు." అని టీమిండియా మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ అన్నాడు.
ఈ మూడో టీ20లో భారత బ్యాటింగ్ ఆర్డర్ సరిగ్గా లేదని అన్నాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్. దానిపై దృష్టి సారించాలని సూచించాడు. ధ్రువ్ జురెల్ను ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు పంపించడం సరైంది కాదని పేర్కొన్నాడు. ఆఖర్లో రైట్ - లెఫ్ట్ బ్యాటింగ్ ఆర్డర్ కాంబినేషన్ గురించి ఆలోచించడం సరైంది కాదని వెల్లడించాడు.