IND vs ENG: ఇంగ్లాండ్ జట్టుతో లండన్ వేదికగా జరిగిన మూడో టీ20లో భారత మహిళల జట్టు పరాజయాన్ని చవిచూసింది. చివరి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన ఉత్కంఠ పోరులో భారత్పై ఇంగ్లాండ్ పైచేయి సాధించింది. ఈ మ్యాచ్లో భారత జట్టుపై ఇంగ్లాండ్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ ఓపెనర్లు సోఫియా డంక్లీ 75 పరుగులు, వ్యాట్ హాడ్జ్ 66 పరుగులతో అద్భుతంగా రాణించారు. భారత బౌలర్లలో అరుంధతీ రెడ్డి, దీప్తి శర్మలు తలో 3 వికెట్లు పడగొట్టగా.. శ్రీ చరణి 2, రాధా యాదవ్ ఒక వికెట్ తీశారు.
ఆ తర్వాత 172 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ బరిలోకి దిగిన టీమిండియా 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 166 పరుగులు మాత్రమే చేసింది. చివరి 2 ఓవర్లలో టీమిండియా విజయానికి 20 పరుగులు అవసరం కాగా.. 19వ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. చివరి ఓవర్లో టీమిండియా విజయానికి 12 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో హర్మన్ ప్రీత్ కౌర్ ఉండడంతో విజయం భారత్దే అని అంతా భావించారు. కానీ చివరి ఓవర్ వేసిన ఇంగ్లండ్ పేసర్ లారెన్ బెల్ అద్భుతంగా బౌలింగ్ చేసి తొలి 5 బంతుల్లో 6 పరుగులు మాత్రమే ఇచ్చింది. చివరి బంతికి 6 రన్స్ అవసరం కాగా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ క్యాచ్ ఔటైంది. ఈ క్రమంలో భారత్ 5 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది.

భారత బ్యాటర్లలో ఓపెనర్లు స్మృతి మంధాన(49 బంతుల్లో 56) అర్థ శతకం బాదగా.. షఫాలీ వర్మ(27 బంతుల్లో 47) చెలరేగిపోయింది. జెమీమా రోడ్రిగ్స్(20), హర్మన్ ప్రీత్ కౌర్(23) పరుగులు చేశారు. టీమిండియా ఇప్పటికే రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే సిరీస్ కైవసం చేసుకుని ఉండేది. ఇంగ్లండ్ బౌలర్లలో లారెన్ ఫైలర్ రెండు వికెట్లు తీయగా.. ఎకిలిస్టోన్, వాంగ్ తలో వికెట్ సాధించారు. ఇరు జట్ల మధ్య నాలుగో టీ20 ఈ నెల 9న మాంచెస్టర్ వేదికగా జరగనుంది