IND vs ENG: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా రెండో టెస్ట్ మ్యాచ్ నేడు బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ స్టేడియంలో జరగనుంది. తొలి మ్యాచ్లో ఓటమిని మరిచిపోయి శుభ్మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా ఎడ్జ్బాస్టన్లో విజయం సాధించి సిరీస్ను 1-1తో సమం చేయాలని భావిస్తోంది. అయితే ఎడ్జ్బాస్టన్లో నేడు తొలిరోజు ఆటపై వర్షం ప్రభావం పడే అవకాశం ఉంది. మరోవైపు మ్యాచ్లో టాస్ కూడా కీలక పాత్ర పోషించనుంది.
ఎడ్జ్బాస్టన్లో టీమిండియా ఇప్పటివరకు ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా గెలవలేదు. కాబట్టి మరోసారి ఈ మైదానంలో భారత జట్టుకు కఠినమైన సవాలు ఎదురుకానుంది. ఈ మ్యాచ్లో టాస్ కూడా కీలకపాత్ర పోషించనుంది. ఒకవేళ టీమిండియా టాస్ గెలిస్తే.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ముందుగా బౌలింగ్ చేయాలని కోరుకుంటాడు. ఎందుకంటే ఈ మైదానంలో ముందుగా బౌలింగ్ చేసిన జట్టుకు మంచి రికార్డు ఉంది. ఈ మైదానంలో ఇప్పటివరకు 56 టెస్ట్ మ్యాచ్లు ఆడబడ్డాయి. వీటిలో ముందుగా బౌలింగ్ చేసిన జట్టు 23 మ్యాచ్లు, బ్యాటింగ్ చేసిన జట్టు 18 మ్యాచ్లు గెలిచింది. దీనితో పాటు ఎడ్జ్బాస్టన్లో 15 మ్యాచ్లు డ్రా అయ్యాయి. టీమిండియా ఎడ్జ్బాస్టన్లో తన చివరి టెస్ట్ మ్యాచ్ను 2022లో ఆడింది. ఈ మ్యాచ్లో భారత జట్టుకు 7 వికెట్ల తేడాతో ఓటమి ఎదురైంది.

ఎడ్జ్బాస్టన్ మైదానంలో టీమిండియా ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడింది. ఇందులో ఎనిమిదింటిలో 7 మ్యాచ్లు ఇంగ్లాండ్ గెలిచింది, ఒక టెస్టు డ్రా అయ్యింది. టీమిండియా గెలిస్తే, శుభమన్ గిల్ ఈ మైదానంలో టెస్టు గెలిచిన మొదటి భారత కెప్టెన్గా నిలవగలడు. కాబట్టి టీమిండియా ఈ సారి చరిత్రను మార్చాలని చూస్తోంది. దీని కోసం టీమిండియా బ్యాటింగ్ నుంచి బౌలింగ్, ఫీల్డింగ్ వరకు మంచి ప్రదర్శన చేయాలి.
పొంచి ఉన్న వర్షం ముప్పు
ఐదు మ్యాచ్ల సిరీస్లో రెండో టెస్ట్ మ్యాచ్ జులై 2 నుంచి జులై 6 వరకు ఎడ్జ్బాస్టన్లో జరుగుతుంది. ఈ మ్యాచ్పై వర్షం ముప్పు పొంచి ఉంది. దీని ప్రభావం తొలిరోజు ఆట నుంచి కనిపించవచ్చు. ఆక్యువెదర్ నివేదిక ప్రకారం, తొలిరోజు వర్షం పడే అవకాశాలు 82 శాతం ఉన్నాయి, దీనితో పాటు, మ్యాచ్ సమయంలో రోజంతా మేఘాలు కమ్మి ఉండవచ్చు. దీని వల్ల ఫాస్ట్ బౌలర్లకు సహాయం లభించే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండవచ్చు.