IND vs ENG: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ఎడ్జ్బాస్టన్లో జరుగుతోంది. ఈ మ్యాచ్పై టీమిండియా పట్టు బిగించింది. మూడో రోజు టీమిండియా బౌలర్లు ఇంగ్లండ్ జట్టును 407 పరుగులకే ఆలౌట్ చేసి 180 పరుగుల ఆధిక్యాన్ని సాధించారు. ఆ తర్వాత రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా ఒక వికెట్ కోల్పోయి 64 పరుగులు చేసింది. మూడో రోజు టీమిండియాకు యశస్వి జైస్వాల్ రూపంలో ఒకే ఒక దెబ్బ తగిలింది. రెండో ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 22 బంతుల్లో 28 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే యశస్వి జైస్వాల్ ఔటైన బంతికి ఆయన డీఆర్ఎస్ కూడా తీసుకున్నాడు. దీనిపై ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ సమయంలో బెన్ స్టోక్స్ అంపైర్లతో వాగ్వాదానికి కూడా దిగారు.
బెన్ స్టోక్స్ ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశాడంటే?
అసలు విషయమేమిటంటే.. ఇంగ్లండ్ తరఫున జోష్ టంగ్ 8వ ఓవర్ వేస్తున్నాడు. నాలుగో బంతి యశస్వి జైస్వాల్ ప్యాడ్కు తగిలింది. దీంతో ఇంగ్లండ్ గట్టిగా అప్పీల్ చేసింది. అంపైర్ యశస్వి జైస్వాల్ను ఔట్గా ప్రకటించారు. అయితే యశస్వి నాన్-స్ట్రైక్లో ఉన్న కేఎల్ రాహుల్తో చర్చించి డీఆర్ఎస్ తీసుకున్నారు. నిజానికి ఏ జట్టుకైనా 15 సెకన్లలోపు డీఆర్ఎస్ తీసుకోవాలి, కానీ ఇక్కడ యశస్వి జైస్వాల్ డీఆర్ఎస్ తీసుకోవడంలో కాస్త ఆలస్యం చేశాడు. అయినప్పటికీ అంపైర్ సమయానికి గమనించలేకపోయారు, కాబట్టి జైస్వాల్ డీఆర్ఎస్ కాల్ను అంగీకరించారు. కానీ ఇదంతా చూసిన బెన్ స్టోక్స్ ఆగ్రహానికి గురయ్యారు. సమయం ముగిసిన తర్వాత కూడా అంపైర్ డీఆర్ఎస్ ఇచ్చినందున ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ నేరుగా అంపైర్ల వద్దకు వెళ్లి వాగ్వాదానికి దిగారు. కానీ అంపైర్లు స్టోక్స్ మాట వినలేదు. డీఆర్ఎస్ తీసుకున్నప్పటికీ యశస్వి జైస్వాల్ తన వికెట్ను కాపాడుకోలేకపోయాడు. థర్డ్ అంపైర్ కూడా యశస్వి జైస్వాల్ ను ఎల్బీడబ్ల్యూగా ప్రకటించారు.

భారత్కు 244 పరుగుల ఆధిక్యం
మూడో రోజు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 407 పరుగులకే ముగిసింది. ఇంగ్లండ్ తరఫున బ్యాటింగ్ చేస్తూ జేమీ స్మిత్ అత్యధికంగా 184 పరుగులు చేశాడు. దీంతో పాటు హ్యారీ బ్రూక్ 158 పరుగులు చేశాడు. టీమిండియా తరఫున మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. మహ్మద్ సిరాజ్ 19.3 ఓవర్లలో 70 పరుగులిచ్చి అత్యధికంగా 6 వికెట్లు పడగొట్టారు. దీనితో పాటు ఆకాష్ దీప్ 20 ఓవర్లలో 88 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 244 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ప్రస్తుతం కేఎల్ రాహుల్ 28, కరుణ్ నాయర్ 7 పరుగులతో నాటౌట్గా ఉన్నారు.