లండన్: లార్డ్స్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్, భారత జట్ల మధ్య గురువారం ప్రారంభం కావాల్సిన రెండో టెస్టుకు వర్షం అడ్డంకిగా మారింది. ఆటగాళ్లు డ్రస్సింగ్ రూమ్కే పరిమితమయ్యారు. దీంతో తొలి రోజు తొలి సెషన్ వర్షార్పణమైంది. ఉదయం నుంచి ఏకదాటిగా వర్షం పడుతుండడంతో మ్యాచ్ తొలి సెషన్ని రద్దు చేసి లంచ్ బ్రేక్ ప్రకటించారు.
వర్షం ఎక్కువగా ఉండటంతో తొలిరోజు ఆట రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. వర్షం కారణంగా మైదానం సిబ్బంది పిచ్ను కవర్లతో కప్పి ఉంచారు. మరోవైపు లార్డ్స్ మైదానం నిర్వాహకులు మాత్రం టీమిండియా, ఇంగ్లాండ్ ఆటగాళ్లకి నోరూరించే భోజనాన్ని సిద్ధం చేశారు.
ఈ భోజనానికి సంబంధించిన మెనూ వివరాలను బీసీసీఐ ట్విట్టర్లో అభిమానులతో పంచుకుంది. ఈ మెనూలో కొన్ని ఇంగ్లీష్ వంటకాలతో పాటు భారతీయ వంటకాలు కూడా ఉన్నాయి. టీమిండియా ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా చికెన్ టిక్కా, పన్నీర్ టిక్కా, మిక్సిడ్ వెజిటేబుల్స్తో పప్పుని సిద్ధం చేశారు.
Delicious and how.
— BCCI (@BCCI) August 9, 2018
Lunch menu for Day 1 here at @HomeOfCricket.#ENGvIND pic.twitter.com/WomcJwF4U8
ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా ఎడ్జ్బాస్టన్లో జరిగిన తొలి టెస్టులో భారత్ 31 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో లార్డ్స్ టెస్టులో గెలవడం ద్వారా సిరీస్ను సమం చేయాలని టీమిండియా కెప్టెన్ కోహ్లీ భావిస్తున్నాడు. ఇప్పటివరకు ఈ మైదానంలో 17 టెస్టులాడిన భారత్ కేవలం రెండింటిలోనే గెలిచింది. నాలుగు డ్రా కాగా, 11 మ్యాచుల్లో ఓడింది.
కాగా, లార్డ్స్ టెస్టును సచిన్ టెండూల్కర్ తన చేతుల మీదుగా ఆరంభించనున్నాడు. ఈ మైదానంలో ఏదైనా మ్యాచ్ ఆరంభానికి ముందు ఐదు నిమిషాల పాటు గంట మోగిస్తారు. పర్యాటక జట్టుకు సంబంధించిన వారు ఎవరైనా గంటను మోగించి లాంఛనంగా మ్యాచ్ను ప్రారంభించడం ఎప్పటి నుంచో ఇక్కడ ఆనవాయితీగా వస్తోన్న విషయం తెలిసిందే.
🔔 @sachin_rt will be ringing the five-minute bell before the start of play today 🙌
— Lord's Cricket Ground (@HomeOfCricket) August 9, 2018
📝➡️ https://t.co/a0vmQTTVMQ#LoveLords#ENGvIND pic.twitter.com/eal3Y1dAoS
ఐదు రోజులు జరిగే టెస్టు మ్యాచ్ సమయంలోనూ ప్రతి రోజూ ఇలా ఎవరో ఒకరు గంట మోగిస్తారు. గురువారం లార్డ్స్ మైదానంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్టు ప్రారంభంకానుంది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తొలి రోజు మ్యాచ్ను గంట మోగించి ప్రారంభించాల్సిందిగా మైదానం నిర్వాహకులు అడిగితే వెంటనే ఒప్పుకున్నాడు.