
లండన్: ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా ప్రస్తుతం భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య లార్డ్స్ మైదానంలో జరుగుతున్న రెండో టెస్టులో బాల్ ట్యాంపరింగ్ కలకలం రేపింది. ఆదివారం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్లో టీమిండియా బ్యాట్స్మన్ జిడ్డు బ్యాటింగ్ కొనసాగిస్తుండడంతో వికెట్లు తీయడంలో ఇబ్బంది పడుతున్న ఇంగ్లండ్.. బంతి ఆకారాన్ని మర్చే ప్రయత్నం చేసినట్లు సమాచారం తెలుస్తుంది. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆ ఫోటోల్లో మొహాలు చూపించకపోవడంతో ఇంగ్లండ్ ఆటగాళ్లు ఎవరనేది కనిపెట్టడం కష్టంగా మారింది.
క్రీజులో నిలదొక్కుకున్న పుజారా, రహానే:
లార్డ్స్ మైదానంలో జరుగుతున్న రెండో టెస్ట్ మూడో రోజు ఆటలో పిచ్ పూర్తిగా బ్యాటింగ్కు సహకరించింది. భారత బౌలర్లు ఎంత ప్రయత్నించినా.. బంతిని స్వింగ్ చేయలేకపోయారు. దీనిని సద్వినియోగం చేసుకున్న ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ (180 నాటౌట్) భారీ సెంచరీ బాదాడు. ఆదివారం ఉదయం బంతి కొంత స్వింగ్ కావడంతో ఇంగ్లండ్ బౌలర్లు మూడు వికెట్లను పడగొట్టారు. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు త్వరగానే ఔట్ అయ్యారు. ఆ తర్వాత తేమ తగ్గిపోవడంతో బంతి స్వింగ్కు అనుకూలించడం లేదు. బంతి అంతంత మాత్రంగానే సహకరిస్తుండడంతో.. చేతేశ్వర్ పుజారా, అజింక్య రహానేలు క్రీజులో నిలదొక్కుకున్నారు.
100 పరుగుల భాగస్వామ్యం :
చేతేశ్వర్ పుజారా, అజింక్య రహానేలు ఇంగ్లండ్ బౌలర్లనుసమర్ధవంతంగా ఎదుర్కొంటూ భారత్ ఇన్నింగ్స్ను గాడిలో పెట్టారు. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వీరు ఎంతకూ ఔట్ కాకపోవడంతో.. ఇంగ్లీష్ బౌలర్లు ఈ పని (బాల్ ట్యాంపరింగ్) చేసి ఉంటారని భావిస్తున్నారు. వీడియోలో బంతిని ఉద్దేశపూర్వకంగా కింద పడేసి.. బూట్లతో తన్నుతూ.. బూట్ల స్పైక్స్తో అదిమి తొక్కుతూ.. ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నించడం టీవీల్లో స్పష్టంగా కనిపించింది. ఇది చూసిన భారత అభిమానులు ఉద్దేశపూర్వకంగా బాల్ టాంపరింగ్కి పాల్పడిన ఇంగ్లండ్ ప్లేయర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఐసీసీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
ఈసీబీ వివరణ ఇస్తుందో లేదో:
బంతిని ట్యాంపర్ చేసేందుకు ఇంగ్లీష్ బౌలర్లు మూడుసార్లు ప్రయత్నించినట్టు వెలుగులోకి వచ్చిన ఫొటోల ద్వారా తెలుస్తోంది. ఈ విషయంపై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) వివరణ ఇస్తుందో, లేదో చూడాలి. ప్రస్తుతానికైతే నాలుగో రోజు ఆట చక్కగా కొనసాగుతోంది. ఇది కచ్చితంగా బాల్ ట్యాంపరింగ్ ప్రయత్నమేనంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కామెంటేటర్ ఆకాశ్ చోప్రా కూడా దీనిపై స్పందించాడు. చూస్తుంటే బాల్ ట్యాంపరింగ్లానే ఉందని అభిప్రాయపడ్డాడు. ఒకవేళ కావాలనే ఇంగ్లండ్ ప్లేయర్స్ ఇలా చేశారని నిరూపితమైతే.. కఠిన చర్యలు తప్పవు.
2018లో ఆసీస్ ప్లేయర్స్:
క్రికెట్లో బాల్టాంపరింగ్ ఉదంతం అనగానే మొదటగా గుర్తుకు వచ్చేది ఆస్ట్రేలియా ఆటగాళ్లు. 2018 కేప్టౌన్ టెస్ట్లో సాండ్ పేపర్ విధానంతో బెన్ క్రాప్ట్ బాల్ టాంపరింగ్కు పాల్పడి కెమెరాలకు అడ్డంగా దొరికిపోయాడు. అయితే ఈ ఉదంతంలో అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ హస్తం కూడా ఉందని తెలియడంతో వారిద్దరిపై ఏడాది పాటు నిషేధం విధించిన ఐసీసీ.. బెన్ క్రాఫ్ట్పై తొమ్మిది నెలల నిషేధం విధించింది. ఆసీస్ క్రికెటర్లు చేసిన బాల్ టాంపరింగ్ ఉదంతం క్రికెట్ కెరీర్లో మాయని మచ్చగా మిగిలిపోయింది.