
లండన్: ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో భారత్ నాలుగో రోజు ఆట నిలిచిపోయేసరికి ఆరు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. వెలుతురు లేమి కారణంగా అంపైర్లు ఆటను కాస్త ముందుగానే నిలిపివేశారు. అప్పటికి వికెట్ కీపర్ రిషబ్ పంత్ (14), సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ (4) నాటౌట్గా ఉన్నారు. దాంతో రెండో టెస్ట్ మ్యాచ్పై భారత్ పట్టు కోల్పోయినట్లుగా అనిపిస్తోంది. చివరి రోజు ఉదయం పంత్ ధాటిగా ఆడి వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయడంపైనే భారత్ ఆశలు సజీవంగా ఉన్నాయి. అంతకుముందు వైస్ కెప్టెన్ అజింక్య రహానే (61), టెస్ట్ స్పెసలిస్ట్ చెతేశ్వర్ పుజారా (45) నాలుగో వికెట్కు శతక భాగస్వామ్యం నెలకొల్పారు. చివరి రోజు ఆట వరుణుడిపై ఆధారపడి ఉంది.
మూడో రోజు శనివారం ఇంగ్లండ్ ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ మొదలెట్టిన టీమిండియాకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. మార్క్ వుడ్ వేసిన 9.2 ఓవర్కు కీపర్కు క్యాచ్ ఇచ్చి ఓపెనర్ కేఎల్ రాహుల్ వెనుదిరిగాడు. దాంతో భారత్ 18 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. రాహుల్ 30 బంతులు ఎదుర్కొని 5 పరుగులు మాత్రమే చేశాడు. ఆరంభం నుంచే రాహుల్ కాస్త తడబడినట్టు కనిపించాడు. తొలి ఇన్నింగ్స్లో అద్భుత సెంచరీతో అదరగొట్టిన రాహుల్ ఆదిలోనే ఔట్ కావడం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది.
కేఎల్ రాహుల్ అవుటైన కాసేపటికే మరో ఓపెనర్ రోహిత్ శర్మ సైతం అవుటయ్యాడు. రాహుల్ను వెనక్కి పంపిన మార్క్ వుడ్కే రోహిత్ కూడా దొరికిపోయాడు. 2 ఫోర్లు, సిక్సర్ బాది ఊపుమీద ఉన్నట్టు కనిపించిన రోహిత్.. 21 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. మార్క్ వుడ్ వేసిన 12వ ఓవర్లో మూడో బంతికి సిక్సర్ బాదిన రోహిత్.. తర్వాత ఆరో బంతికి మరో భారీ షాట్ ఆడి మోయిన్ అలీ చేతికి చిక్కాడు. దాంతో భారత్ 27 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో చేతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీలు భారత ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే నాలుగు ఫోర్లు కొట్టి జోరుమీద ఉన్నట్టు కనిపించినా.. సామ్ కరన్ బౌలింగ్లో వికెట్ కీపర్ జోస్ బట్లర్కు క్యాచ్ ఇచ్చి కోహ్లీ పెవిలియన్ చేరాడు.
55 పరుగులకే ముగ్గురు టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ విఫలమవడంతో అజింక్య రహానే, చేతేశ్వర్ పుజారా కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇంగ్లాండ్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తూ ఇద్దరూ ఆచితూచి ఆడారు. ఈ క్రమంలోనే నాలుగో వికెట్కు శతక భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే అదే సమయంలో పుజారా అనుకోని బంతికి ఔటయ్యాడు. మార్క్ వుడ్ వేసిన షార్ట్ పిచ్ బంతి అతడి గ్లౌజులకు తగిలి జో రూట్ చేతిలో పడింది. దాంతో భారత్ 155 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. కాసేపటికే అర్ధ శతకంచేసిన రహానే కూడా పెవిలియన్ చేరాడు. మోయిన్ అలీ బౌలింగ్లో కీపర్ చేతికి చిక్కాడు.
ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న రవీంద్ర జడేజా (3) సైతం నిరాశపరిచాడు. అతడిని కూడా అలీ బౌల్డ్ చేయడంతో భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. అలా స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయి మ్యాచ్పై పట్టు కోల్పోయింది. ఈ క్రమంలోనే జోడీ కట్టిన రిషబ్ పంత్, ఇషాంత్ శర్మ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. అయితే 82 ఓవర్ల తర్వాత వెలుతురు లేమి కారణంగా అంపైర్లు ఆటను నిలిపివేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ మూడు, మోయిన్ అలీ రెండు, సామ్ కరన్ ఒక వికెట్ తీశారు. రెండో టెస్ట్ మ్యాచ్పై భారత్ పట్టు కోల్పోయినట్లుగా అనిపిస్తోంది. చివరి రోజు ఉదయం పంత్ ధాటిగా ఆడి వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయడంపైనే భారత్ ఆశలు సజీవంగా ఉన్నాయి.