
లండన్: ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు..ఇవ్వాళ రెండో టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడబోతోంది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో ఇప్పటికే ముందంజలో ఉంది టీమిండియా. 1-0 తేడాతో ఇంగ్లాండ్పై ఆధిక్యతను సాధించింది. ఈ రాత్రికి రెండో టీట్వంటీలో తలపడబోతోంది. సౌతాంప్టన్లో జరిగిన తొలి టీ20లో ప్రత్యర్థిని ఏకంగా 50 పరుగుల తేడాతో మట్టి కరిపించిన కదనోత్సాహంలో కనిపిస్తోంది టీమిండియా.
టీ20 మ్యాచ్లల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డుకు చేరువగా ఉన్నారు. ఇవ్వాళ్టి మ్యాచ్లో దాన్ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఇద్దరిలో ఆ ల్యాండ్ మార్క్ను తొలుత ఎవరు అందుకుంటారనేది ఆసక్తి రేపుతోన్న విషయం. ఇప్పటివరకూ వీరిద్దరూ టీ20 ఫార్మట్ క్రికెట్లో 298 బౌండరీలు బాదారు. ఫోర్లల్లో 300 మార్క్ను అందుకోవడానికి రెండు బౌండరీల దూరంలో నిలిచారు ఒకేసారి.
ఇవ్వాళ బర్మింగ్ హామ్ ఎడ్జ్బాస్టన్ స్టేడియంలో ఇంగ్లాండ్తో తలపడే రెండో టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్లో దీన్ని అందుకునే అవకాశాలు లేకపోలేదు. సాధారణంగా కేప్టెన్ రోహిత్ శర్మ- ఓపెనర్గా బరిలోకి దిగుతుంటాడు. విరాట్ కోహ్లీ వన్ డౌన్ బ్యాటర్గా క్రీజ్లోకి వస్తుంటాడు. విరాట్ కోహ్లీతో పోల్చుకుంటే రోహిత్ శర్మే తొలిసారిగా ఈ 300 బౌండరీల మార్క్ను అందుకుంటాడనడంలో సందేహాలు అక్కర్లేదు. కావాల్సింది రెండు బౌండరీలే అయినందున దీన్ని అందుకోవడానికి పెద్దగా శ్రమించనక్కర్లేదు.
ప్రస్తుతం ఈ రికార్డు ఐర్లాండ్ ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ మీద మాత్రమే ఉంది. 104 టీ20 మ్యాచ్లను ఆడిన స్టిర్లింగ్ 325 బౌండరీలు కొట్టాడు. వంద సిక్సర్లు అతని ఖాతాలో ఉన్నాయి. ఇప్పటివరకు విరాట్ కోహ్లీ 97 టీ20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. 3,296 పరుగులు చేశాడు. 298 బౌండరీలు, 92 సిక్సర్లు కొట్టాడు. అతని బ్యాటింగ్ యావరేజ్ 51.5. చివరి ఆరు మ్యాచ్లల్లో విఫలం అయ్యాడు. ఈ ఆరింట్లో అతని బ్యాటింగ్ యావరేజ్ 26 మాత్రమే.
2019 నవంబర్ తరువాత విరాట్ కోహ్లీ బ్యాట్ నుంచి సెంచరీ జాలువారలేదు. అన్ని ఫార్మట్లలోనూ అతని బ్యాటింగ్ యావరేజ్ బాగా దిగజారింది. అటు ఐపీఎల్ 2022 సీజన్లోనూ అంచనాలకు తగ్గట్టుగా ఆడలేకపోయాడు. 16 మ్యాచ్లల్లో 341 పరుగులు చేశాడు. బ్యాటింగ్ యావరేజ్ 22.73.