
లండన్: ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు..ఇవ్వాళ రెండో టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడబోతోంది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో ఇప్పటికే ముందంజలో ఉంది టీమిండియా. 1-0 తేడాతో ఇంగ్లాండ్పై ఆధిక్యతను సాధించింది. సౌతాంప్టన్లో జరిగిన తొలి టీ20లో ప్రత్యర్థిని ఏకంగా 50 పరుగుల తేడాతో మట్టి కరిపించిన కదనోత్సాహంలో ఉంది టీమిండియా. ఈ మ్యాచ్లో కూడా గెలవడం ద్వారా సిరీస్ను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది.
ఈ సిరీస్లో ఇషాన్ కిషన్ పెద్దగా రాణించకపోవడం టీమిండియాను కొంత ఆందోళనకు గురి చేస్తోంది. ఇదివరకు ముగిసిన ఐర్లాండ్ పర్యటనలోనూ అతను పెద్దగా సత్తా చాటలేకపోయాడు. రెండు టీ20 మ్యాచ్ల సిరీస్లో అతను మొత్తంగా చేసిన పరుగులు 29 పరుగులే. ఇంగ్లాండ్తో తొలి టీ20 మ్యాచ్లో కూడా విఫలం అయ్యాడు. ఎనిమిది పరుగులకే వెనుదిరిగాడు. ఓపెనర్గా అతను సరైన జోడీ కాదనే అభిప్రాయాలు వ్యక్తం కావడం మొదలయ్యాయి కూడా.
ఇషాన్ కిషన్ నిలకడగా ఆడట్లేదని, కీలకమైన ఓపెనింగ్ స్థానం నుంచి తప్పించాల్సిన అవసరం ఉందని భారత జట్టు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఓపెనర్గా ఇషాన్ కిషన్ త్వరగా అవుట్ కావడం వల్ల అతని ఓపెనింగ్ జోడీతో పాటు, మిగిలిన బ్యాటింగ్ లైనప్ మీద ప్రభావం పడుతుందని, ఒత్తిడి ఎదురవుతుందని చెబుతున్నారు. అతనికి బదులుగా మరో వికెట్ కీపర్ రిషభ్ పంత్ను తుది జట్టులోకి తీసుకుని ఓపెనర్గా పంపిస్తే బాగుంటుందని స్పష్టం చేస్తోన్నారు.
రిషభ్ పంత్- ఇషాన్ కిషన్లల్లో ఓపెనర్గా ఎవరో ఒకరిని ఎంపిక చేయాల్సి వస్తే- తాను పంత్ వైపే మొగ్గు చూపుతానని టీమిండియా మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ పేర్కొన్నాడు. అతణ్ని ఓపెనర్గా పంపించే ప్రయోగం చేయవచ్చని వ్యాఖ్యానించాడు. భారత జట్టుకు ఇప్పుడు అందుబాటులో ఉన్న వికెట్ కీపర్ బ్యాటర్లల్లో దినేష్ కార్తీక్.. అత్యుత్తమ ఫినిషర్గా అభివర్ణించాడు. ఈ ఏడాది టీ20ల్లో ఇషాన్ కిషన్ అత్యధిక స్కోర్ చేసిన బ్యాటర్గా కొనసాగుతున్నాడని పేర్కొన్నాడు. అతనిలో నిలకడ లోపించిందని చెప్పాడు.
రిషభ్ పంత్ గురించి చెప్పుకోవాల్సిన పని లేదని, బ్యాటింగ్ లైనప్లో ఏ స్థానంలో అయినా రాణించగల శక్తి సామర్థ్యాలు అతనికి ఉన్నాయని చెప్పాడు. రోహిత్ శర్మకు జోడీగా ఇషాన్ కిషన్కు బదులుగా రిషభ్ పంత్ను పంపించడం వల్ల మంచి ఫలితాలు రావొచ్చని అన్నాడు. ఓపెనర్గా రిషభ్ పంత్కు అవకాశం ఇవ్వాల్సిన సమయం వచ్చిందని, ఈ ప్రయోగం విజయవంతమైతే- టీ20 ప్రపంచ కప్ జట్టు కూర్పు బాగుటుందని చెప్పాడు.